గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్
దిల్లీ: గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్ను ఉపయోగించే వినియోదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే మూడు నెలల్లో ఎనిమిది సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. దానితో పాటు 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే వారికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పెట్రోలియం మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించాలనే యోచనలో కేంద్రం ఉండటంతో ఈ ప్రకటన పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఊరట కలిగించనుంది.
కరోనా వెల్ఫేర్ ప్యాకేజి కింద కేంద్ర ప్రభుత్వం మార్చి 26న రూ.1.7 లక్షల కోట్లు కేటాయించింది. దాని కింద వంట గ్యాస్ను ఉపయోగించే 8 కోట్ల మంది పేదలకు మూడు సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నారు
''ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద (పీఎంజీకేవై) 5 కిలోల సిలిండర్లు ఉపయోగించే వారికి ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచితంగా ఎనిమిది సిలిండర్లు అందివ్వనున్నాం. ఈ నెలలో ఇప్పటి వరకు 1.26 కోట్ల సిలిండర్లకు బుకింగ్స్ వచ్చాయి. అందులో 85 లక్షల సిలిండర్లను ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎమ్యువై) కింద అర్హులకు అందజేశాం. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు కొంత ఊరట కలిగించడం దీని ముఖ్యోద్దేశం'' అని సదరు అధికారి తెలిపారు.
ఇప్పటి వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 5,606 కోట్ల నగదును 7.15 కోట్ల మంది పీఎంయువై లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ముందస్తుగా వేయనుంది. దాని వల్ల వారంగా పీఎంజీకేవై ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు పొందవచ్చని తెలిపారు. ఇప్పటికే రూ.2,780 కోట్ల నగదును 37 మిలియన్ మంది పీఎంయువై లబ్దిదారుల ఖాతాల్లో జమచేసినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. దీనితో పాటుగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 85 లక్షల మందికి పీఎంయువై కింద ఉచితంగా సిలిండర్లు అందివ్వనున్నట్లు తెలిపింది.
0 Response to "గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్"
Post a Comment