జయహో ఇస్రో


  • ‘విజయాశ్వం’తో మరో అద్భుతం
  • పీఎ్‌సఎల్వీ-సీ47 ప్రయోగం సక్సెస్‌
  • 17 నిమిషాల్లోనే కక్ష్యలోకి కార్టోశాట్‌.. 
  • 13 విదేశీ ఉపగ్రహాలు కూడా
  • 27 నిమిషాల్లోనే ముగిసిన ప్రక్రియ
  • ఇస్రో ఖాతాలో మరో అద్భుత విజయం
 
రెండు నెలల క్రితం ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 వైఫల్యం మిగిల్చిన చేదు జ్ఞాపకాన్ని మరిపించేలా భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈసారి విజయం సాధించి తీరాలన్న కసితో సంసిద్ధమైంది. కానీ.. ఏ మూలనో చిన్న అనుమానం.. ప్రయోగానికి ముందు ఉద్విగ్నత.. కార్టోశాట్‌ ఉపగ్రహాన్ని తీసుకుని పీఎ్‌సఎల్వీ-సీ47 బయల్దేరగానే తీవ్ర ఉత్కంఠ! అయితే ఇస్రో ‘విజయాశ్వం’ పీఎ్‌సఎల్వీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ 17 నిమిషాల్లోనే కార్టోశాట్‌-3ని తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. మరో అద్భుత విజయాన్ని ఇస్రో ఖాతాలో వేసింది

హరికోట (సూళ్లూరుపేట), నవంబరు 27: భారత సరిహద్దుల నిఘానేత్రం కార్టోశాట్‌-3 విజయవంతంగా కక్ష్యలోకి అడుగుపెట్టింది. పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ-సీ47 రాకెట్‌ స్వదేశీ కార్టోశాట్‌-3తోపాటు అమెరికాకు చెందిన 12 ఫ్లోప్‌-4పీ నానో ఉపగ్రహాలు, మరో మెస్‌బెడ్‌ ఉపగ్రహాన్ని రోదసీలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి వదిలింది. ఈ ప్రయోగంతో మొత్తం 14 ఉపగ్రహాలను రోదసీలోకి చేర్చిన పీఎ్‌సఎల్వీ 47వ విజయాన్ని సొంతంచేసుకుంది.
 
ప్రయోగం సాగిందిలా..
మంగళవారం ఉదయం 7:28 గంటలకు ప్రారంభమైన 26 గంటల కౌంట్‌డౌన్‌ బుధవారం ఉదయం 9:28 గంటలకు ముగిసింది.
కౌంట్‌డౌన్‌ ముగియగానే రెండో వేదికపై పీఎ్‌సఎల్వీ-సీ47 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
17.38 నిమిషాలకు 509 కి.మీ ఎత్తుకు చేరగానే అడాప్టర్‌ నుంచి కార్టోశాట్‌-3 ఉపగ్రహం విడిపోయింది. అలా భూమధ్య రేఖకు 97.5 డిగ్రీల వాలులో సూర్య సమస్థితి కక్ష్యలో ఈ ఉపగ్రహం స్థిరపడింది.
మిగిలిన 13 విదేశీ నానో ఉపగ్రహాలతో ఉన్న అడాప్టర్‌ ముందుకు వెళ్తుండగా 516 కి.మీ. ఎత్తులో మెస్‌బెడ్‌ ఉపగ్రహం విడిపోయింది.
26.56 నిమిషాలకు 527 కి.మీ.లోపు ఎత్తులో 12 ఫ్లోప్‌-4పీ ఉపగ్రహాలు పావురాళ్లలా ఒకదాని వెనుక ఒకటివిడిపోయాయి.
అప్పటి వరకూ షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఉత్కంఠగా చూస్తున్న ఇస్రో చైర్మన్‌ కె శివన్‌ లేచి ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు.
 
కార్టోశాట్‌ ఏం చేస్తుందంటే..
కార్టోశాట్‌-3 దేశ రక్షణ రంగానికి నిఘా నేత్రంగా ఉపయోగపడనుంది.
దీనిలో అమర్చిన హై రిజల్యూషన్‌ కెమెరా సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను, వారి కదలికలను పసిగట్టి అత్యంత స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. అలాగే వాతావరణ స్థితిగతులను తెలియజేయడంతోపాటు మ్యాప్‌ల తయారీకి ఉపయోగపడనుంది. ఇది రోదసీలో ఐదేళ్లపాటు పనిచేస్తుంది.
మెస్‌బెడ్‌
అమెరికాకు చెందిన అనలిటికల్‌ స్పేస్‌ ఇంక్‌ సంస్థ దీన్ని తయారుచేసింది. ఉపగ్రహం అందించే డేటాను వివిధ దేశాల్లోని కంపెనీలకు ఈ సంస్థ విక్రయించనుంది.
 
ఫ్లోప్‌-4పీ..
అమెరికాలోని ప్లానెట్‌ల్యాబ్‌ ఈ ఉపగ్రహాన్ని తయారుచేసింది. 5 కిలోల బరువుండే వీటిని డవ్‌ (పావురాలు) ఉపగ్రహాలని పిలుస్తారు. ఈ సంస్థ ఇప్పటి వరకు మన దేశం నుంచి 92 డవ్‌ ఉపగ్రహాలను ప్రయోగించగా, 66 పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 12 ఫ్లోఫ్‌-4పీ ఉపగ్రహాలను రోదసిలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.
 
అవును.. విక్రమ్‌ కూలింది
రెండు నెలల క్రితం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైంది. ఆర్బిటర్‌ నుంచి బయటకు వచ్చిన విక్రమ్‌ ల్యాండర్‌ మరికొద్ది సేపట్లో చంద్రునిపై దిగుతుందనగా ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది. ‘ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. డేటాను విశ్లేషిస్తున్నాం’ అని ఇస్రో చెప్పింది తప్ప మరిన్ని వివరాలు వెల్లడించలేదు. ఈ ప్రయోగం జరిగిన రెండు నెలలకు భారత ప్రభుత్వం.. విక్రమ్‌ ల్యాండర్‌ కుప్పకూలిపోయిందని అంగీకరించింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు.. ‘విక్రమ్‌ ల్యాండర్‌లోని బ్రేకింగ్‌ థస్టర్లు పనిచేయలేదు. దీంతో అది అదుపుతప్పి 500 మీటర్ల ఎత్తు నుంచి చంద్రునిపై కుప్పకూలింది’ అని అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.
 
మార్చిలోగా 7ఉపగ్రహాలు
2020 మార్చిలోగా 6 రాకెట్లతో 7 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ ప్రకటించారు. బుధవారం పీఎ్‌సఎల్వీ-సీ47 ప్రయోగ విజయానంతరం ఆయన షార్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడారు. కార్టోశాట్‌-3 హైరిజల్యూషన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ అని, అత్యంత స్పష్టమైన భూ చిత్రాలను ఇది అందిస్తుందని చెప్పారు. పీఎ్‌సఎల్వీ-సీ47 అత్యంత సునాయాసంగా 14 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసి తన విశ్వసనీయతను మరోమారు చాటుకుందని ఆయన అన్నారు. కాగా పీఎ్‌సఎల్వీ-సీ47 ప్రయోగంతో 300 విదేశీ ఉపగ్రహాల కక్ష్యలోకి చేరవేసి అరుదైన ఘనతను ఇస్రో సొంతం చేసుకుంది.
 
దేశం గర్విస్తోంది: మోదీ
పీఎ్‌సఎల్వీ-సీ47 ద్వారా ప్రయోగించిన కార్టోశాట్‌-3 ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో బృందాన్ని ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా అభినందించారు. మరోసారి దేశం గర్వించేలా చేసిన ఇస్రో టీమ్‌కు అభినందనలు అని మోదీ ట్వీట్‌ చేశారు. పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ఇది ఇస్రో సాధించిన మరో అద్భుత విజయమని కొనియాడారు. కార్టోశాట్‌-3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అభినందించారు. మన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటారంటూ కొనియాడారు. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడం పట్ల బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రోను అభినందించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జయహో ఇస్రో"

Post a Comment