ఒక్క క్లిక్తో మన ఆరోగ్య చరిత్ర
ఒక్క క్లిక్తో మన ఆరోగ్య చరిత్ర
ఆసుపత్రులకు పాత రికార్డులు తీసుకెళ్లనవసరం లేదు
ఆరోగ్య విశిష్ట గుర్తింపు సంఖ్య చెబితే చాలు
ఎలక్ట్రానిక్ రూపంలో వివరాలన్నీ ప్రత్యక్షం
కార్యాచరణ దిశగా జాతీయ ఆరోగ్య డిజిటల్ బ్లూప్రింట్కు రూపకల్పన
ఈనాడు - దిల్లీ
డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ అంటే...
దేశంలోని ప్రజలందరి వైద్య, ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసి, ఎప్పుడైనా, ఎక్కడైనా వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఎలాంటి సంస్థాగత యంత్రాంగాన్ని, కార్యాచరణను రూపొందించుకోవాలో సూచించే విస్పష్ట ప్రణాళికే ‘నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్’. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక విశిష్ట ఆరోగ్య సంఖ్యను ఇచ్చి దానిమీద వారి ఆరోగ్య వివరాలన్నీ నిక్షిప్తం చేస్తారు. ఒక ఆసుపత్రిలో వైద్యసేవలు అందుకున్న వ్యక్తి అక్కడి రికార్డులన్నీ తీసుకొని మరో ఆసుపత్రికి వెళ్లడం ఇబ్బందికరమే. ఎవరి రికార్డు వారి నియంత్రణలో ఉండి, దేశంలో ఎక్కడికెళ్లినా ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. వ్యక్తిగతంగా రోగి, అధీకృత డాక్టర్కు మాత్రమే ఆ ఆరోగ్య నివేదికను చూసే అవకాశం ఉంటుంది.
ఆయుష్మాన్ భారత్లో రెండు అంశాలున్నాయి. ఒకటి పీఎంజేఏవై.. వైద్య బీమా పథకం. రోగులకు ఉచిత వైద్యం అందిస్తుంది. రెండోది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు. జబ్బు చేసిన తర్వాత పరీక్షించి వైద్యం అందించడం కాకుండా, ముందే వైద్య పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే జాగ్రత్తపడటం కోసం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటును ఉద్దేశించారు. ఇప్పుడు దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సహా మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటివి ప్రమాదకరంగా పరిణమించాయి. అందుకే దేశవ్యాప్తంగా 1.50 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు నెలకొల్పి వాటిలో పరీక్షలు జరిపి ఆరోగ్య సమస్యలున్న వారికి తదుపరి చికిత్స అందించడం ఆయుష్మాన్భారత్ లక్ష్యం. ఈ పథకంలోని రెండు అంశాలను అనుసంధానం చేయాలంటే వైద్యపరమైన రికార్డులు తప్పనిసరి. అందుకే దేశవ్యాప్తంగా ఒకేరకమైన ప్రమాణాలతో ప్రజల ఆరోగ్య రికార్డులను నిర్వహించాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది
దేశంలో రోగి ఎక్కడైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే ఆ రికార్డునంతా వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆరోగ్య విశిష్ట గుర్తింపు సంఖ్య వెల్లడించిన వెంటనే వివరాలన్నీ అందుబాటులోకి వస్తాయి
ప్రజల వైద్య, ఆరోగ్యానికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఒకే విధమైన ప్రమాణాలను నెలకొల్పడం ‘నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్’ ప్రధాన లక్ష్యం
వైద్య రికార్డుల నిర్వహణలో ఏకరూపత
- నిపుణుల కమిటీ ఛైర్మన్ జె.సత్యనారాయణ
ప్రజల ఆరోగ్య వివరాల డిజిటలీకరణపై బ్లూప్రింట్ తయారు చేయటానికి తెలుగు వారైన విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ విడుదల చేసి దానిపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించారు. డిజిటల్ బ్లూప్రింట్పై మరిన్ని విషయాలను కమిటీ ఛైర్మన్ జె.సత్యనారాయణ ‘ఈనాడు’తో పంచుకున్నారు. ‘‘30 ఏళ్లుగా వైద్యరంగంలో సమాచార సాంకేతికత(ఐటీ)ని ఉపయోగిస్తున్నా అది సంఘటితంగా, అన్నిచోట్లా ఏకరీతిలో లేదు. వైద్య రికార్డుల నిర్వహణలోనూ ఒక ఆసుపత్రికి, మరో ఆసుపత్రికి పొంతన ఉండటంలేదు. ఈ లోపాన్ని సరిదిద్దాలని జాతీయ వైద్య విధానంలో సంకల్పించారు’’ అని సత్యనారాయణ తెలిపారు. ఒక చిన్న ప్రైవేట్ ప్రాక్టీషనర్ నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకు అందరూ ఒకేరకమైన ప్రమాణాలతో రికార్డులను నిర్వహించేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసమే డిజిటల్ బ్లూప్రింట్ రూపొందిస్తునట్లు చెప్పారు. అయితే, దీని కోసం జీఎస్టీ నెట్వర్క్ లాంటిదానిని ఏర్పాటుచేసే ఉద్దేశం లేదన్నారు. ఆరోగ్యపరమైన రికార్డులనూ అందరూ ఒకే తరహాలో నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ రూపంలో వాటిని ఎక్కడికైనా సులభంగా పంపించవచ్చని సత్యనారాయణ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అందరు వైద్యులు, అన్ని ఆసుపత్రులను ఒకేసారి దీని పరిధిలోకి తీసుకురావడం కుదరదు కనుక దశల వారీగా అవగాహన కల్పించి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ఈ మొత్తం కార్యక్రమం పర్యవేక్షణకు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనే వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పారు. డిజిటల్ బ్లూప్రింట్పై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మూడువారాల గడువు ఇచ్చింది. మేధావులు, ప్రజారోగ్య నిపుణులు, ఆసుపత్రి
యాజమాన్యాలు, సాంకేతిక నిపుణులు విభిన్నకోణాల్లో సూచనలు, సలహాలు ఇస్తారు కనుక అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నివేదికను అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందిస్తామని సత్యనారాయణ తెలిపారు
0 Response to "ఒక్క క్లిక్తో మన ఆరోగ్య చరిత్ర"
Post a Comment