12 బిల్లులు సభకు! ఆమోదించిన మంత్రిమండలి కొన్ని జీవోలకూ అనుమతి
ఆమోదించిన మంత్రిమండలి
కొన్ని జీవోలకూ అనుమతి
ఈనాడు, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం నుంచి రోజూ ఒకటి లేదా రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 12 బిల్లుల వరకు ప్రవేశపెట్టనుంది. వీటికి సంబంధించిన ముసాయిదా బిల్లులపై గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మొత్తం 17 అజెండా అంశాలపై చర్చించారు. ఇందులో 12 ముసాయిదా బిల్లులు కాగా, మిగిలిన వాటిలో ఇప్పటికే జారీ అయిన జీఓలను ఆమోదించారు.
వాలంటీర్ల నియామకం
గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల నియమకాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గ్రామస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలుచేసేందుకు ఈ సచివాలయాలు దోహదపడతాయని అభిప్రాయపడింది. వాలంటీర్లకు నెలకు రూ.5వేల చొప్పున వేతనం చెల్లించేందుకు సమ్మతించింది. గ్రామాల్లో వాలంటీర్ల నియామక ప్రక్రియ, వారికి శిక్షణ నిమిత్తం రూ.12 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు మంత్రిమండలికి తెలిపారు.
దేవాలయాల చట్టం సవరణ
దేవాలయాల్లో నామినేటెడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించేందుకు, అలాగే ఈ కమిటీల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల చట్టం-1987ను సవరిస్తూ సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుపై ఆమోదముద్ర వేసింది.
కౌలుదారుతో భూయజమానుల ఒప్పందంపై..
భూ యజమానుల యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారు 11 నెలలపాటు సాగు చేసుకునేందుకు ఒప్పందం చేసుకునేలా ముసాయిదా బిల్లును ఆమోదించింది. దీంతోపాటు రైతు భరోసా కింద రైతులకు ఇవ్వనున్న రూ12,500 పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసేందుకు అనుమతించింది.
* భూవివాదాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్-2019 సవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపింది.
మద్యనిషేధానికి తొలిఅడుగు
* దశలవారీగా మద్యనిషేధ]ం అమలుకు తొలి అడుగుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఎక్సైజ్ చట్టం-1993 సవరణకు అనుమతించింది.
* ఎస్టీ కాలనీలు, తండాల్లో ఉంటున్న ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు ఏటా రూ.81.11 కోట్ల మేర అవసరమవుతుందని ప్రతిపాదించారు.
* అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7వేలు వంతున వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. పెంచిన జీతాలు జులై నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెంచినజీతాలతో 1,04,377 మందికి అదనపు లబ్ధిచేకూరుతుందని, ప్రభుత్వం నెలకు రూ.125 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు.
* స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఇప్పటికే జారీ చేసిన జీఓను ఆమోదించారు.
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50లకే ఇచ్చేందుకు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్క్ కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో 149 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయిస్తూ జారీ అయిన జీవోనూ ఆమోదించారు.
ముఖ్యమైన బిల్లులివి
1. గ్రామ సచివాలయాలు..
2. దేవాలయాల చట్టం
3. కౌలుదారులతో భూ యజమానుల ఒప్పందం
4. భూవివాదాల పరిష్కారం
5. దశలవారీ మద్య నిషేధం
0 Response to "12 బిల్లులు సభకు! ఆమోదించిన మంత్రిమండలి కొన్ని జీవోలకూ అనుమతి"
Post a Comment