2030 కల్లా విద్యాభారతమే లక్ష్యం

2030 కల్లా విద్యాభారతమే లక్ష్యం


మూడు దశాబ్దాలకు సరిపడేలా నూతన విద్యావిధానం
డిగ్రీ చదువులో సమూల మార్పులు
జాతీయ నూతన విద్యా విధానం కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌
ఈనాడు - హైదరాబాద్‌




దేశంలోని ప్రజలందరూ 2030 నాటికి విద్యావంతులు కావాలన్నదే నూతన విద్యా విధానం లక్ష్యమని జాతీయ విద్యా విధానం కమిటీ ఛైర్మన్‌, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో సుస్థిర అభివృద్ధికి నూతన విధానం బాటలు వేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తమకు రెండు దశాబ్దాలకు సరిపడేలా విద్యా విధానం తీసుకురావాలని చెప్పిందని, తమ కమిటీ మాత్రం మూడు దశాబ్దాలకు సరిపడేలా పాలసీని రూపొందించినట్లు వివరించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ‘ఉన్నత విద్యా విధానం: మూల్యాంకనంలో సంస్కరణలు’ అనే అంశంపై దక్షిణ భారతదేశ స్థాయిలో రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. కార్యక్రమంలో హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొ.పి.అప్పారావు, ఇఫ్లూ వీసీ ప్రొ.ఇ.సురేష్‌కుమార్‌, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు గ్రహీత గోవర్ధన్‌ మెహతా, యూజీసీ సంయుక్త కార్యదర్శి జి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఈ సదస్సులో భాగంగా నూతన విద్యా విధానంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి కస్తూరిరంగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..2017 జులై నుంచి 70 సంస్థలు, 216 మంది ప్రముఖులతోపాటు ఎంతో మంది సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త విధానం రూపొందించినట్లు వివరించారు. 1968, 1986, 1992లో వచ్చిన విధానాలనూ పరిశీలించినట్లు చెప్పారు. కొత్త విధానంతో దేశంలో సామాజిక, పారిశ్రామిక మార్పులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 3-6ఏళ్ల వయసులో పిల్లల్లో మేధాశక్తిని పెంచే ఉద్దేశంతో స్కూల్‌ కాంప్లెక్సుల విధానం సూచించినట్లు పేర్కొన్నారు. నూతన విధానంలో ఇంటర్మీడియట్‌కు ప్రాధాన్యం ఉండదని, పాఠశాల విద్య తర్వాత నేరుగా అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరేలా ఉంటుందన్నారు.

3 నుంచి 18ఏళ్ల వయసు వచ్చేవరకు ఒకే తరహా విద్య ఉంటుందన్నారు. అండర్‌గ్రాడ్యుయేట్‌ విధానంలో సమూల మార్పులు సూచించినట్లు కస్తూరి రంగన్‌ చెప్పారు. డిగ్రీ అనేది 3, 4 సంవత్సరాలు ఉంటుందని, ఇందులో ఒక ఏడాది చదివి మానేసినా.. తర్వాత అవసరమైనప్పుడు తిరిగి రెండో ఏడాది నుంచి చదువు కొనసాగించే వెసులుబాటు ఉంటుందన్నారు. మొదటి ఏడాదిలో మానేస్తే విద్యార్థులకు సర్టిఫికెట్‌ ఇస్తారని, రెండో ఏడాదిలో మానేస్తే డిప్లొమా, మూడో ఏడాదిలో డిగ్రీ, నాలుగో ఏడాదిలో ఆనర్స్‌ డిగ్రీ పట్టాలు ఇచ్చేలా చేశామన్నారు. అలాగే మాస్టర్స్‌ డిగ్రీ సైతం అండర్‌గ్రాడ్యుయేట్‌పై ఆధారపడి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న 900 యూనివర్సిటీలు, 40వేల కళాశాలలను హేతుబద్ధీకరించి 15వేల విద్యాసంస్థలకు కుదించాలని, వాటిని పూర్తి వసతులతో ఆధునికీకరించాలన్నారు.

ముఖ్యంగా పరిశోధనలు, బోధనకు పెద్దపీట వేస్తూ ఉన్నత విద్య ఉండాలన్నారు. ఇందుకు విద్యాసంస్థలను మూడు విభాగాలుగా విభజించాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం జాతీయ స్థాయిలో రాష్ట్రీయ శిక్ష ఆయోగ్‌ ఏర్పాటు చేయాలని, విద్య పరంగా ఇది దేశంలో అత్యున్నతంగా వ్యవహరిస్తుందని తెలిపారు. దీనికి ప్రధాని ఛైర్మన్‌గా ఉంటారని, వివిధ సంస్థలకు చెందిన 20-30 మంది ప్రముఖులు ఉంటారన్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను రొటేషన్‌ పద్ధతిలో ఎంపిక చేయాలని పేర్కొన్నారు. తర్వాత స్థాయిలో మరో రెండు వ్యవస్థలు ఉండాలని సూచించారు.

పరిశోధనల కోసం ప్రత్యేక నిధి
పరిశోధన, ఆవిష్కరణలకు మన దేశంలో కేవలం 0.7శాతం నిధులు కేటాయిస్తుండగా చైనాలో 2.1శాతం, అమెరికాలో 2.8శాతం, దక్షిణకొరియాలో 4.8శాతం నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేసి జాతీయ పరిశోధన నిధిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ నిధులను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బీఈడీ 2030 వరకు కొనసాగుతుందని, అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో అన్ని కోర్సులను చదివేలా ఉండాలని కొత్త విధానంలో పేర్కొనట్లు గుర్తుచేశారు. అనుబంధ కళాశాలలు, వర్సిటీలను రద్దు చేయాలని సూచించామని వెల్లడించారు. అన్ని ఉన్నత విద్యాసంస్థలకు స్వతంత్రంగా ఫీజు నిర్ణయించుకునే అధికారం ఉండాలని సూచించినట్లు చెప్పారు. యూజీసీని ఉన్నత విద్యానిధి మండలిగా మార్చాలని చెప్పామన్నారు.

అరటిపండు, పాలు ఉదాహరణకే
ముసాయిదాలో అరటిపండు, పాలు ఇవ్వాలని(ఇవి కలిపి తినకూడదు) సూచించడంపై పలువురు ఆచార్యులు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయగా కస్తూరి రంగన్‌ వివరణ ఇచ్చారు. అది కేవలం ఉదాహరణ మాత్రమేనని..రాష్ట్రాలు తమ వీలును బట్టి ఏదైనా ఒక పండు లేదంటే గుడ్డుతోపాటు పాలను అల్పాహారం కింద విద్యార్థులకు ఇవ్వవచ్చని తెలిపారు.
* ఆధ్యాత్మిక బోధనపైనా నూతన విద్యా విధానం దృష్టి సారించాలని దయాల్‌బాగ్‌ విద్యాసంస్థల(ఆగ్రా) సంచాలకుడు పి.కె.కల్రా సూచించారు.
* ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీలు తాము సాధించే లాభాల్లో కొంతమొత్తాన్ని విద్యావ్యవస్థకు కేటాయించాలని, ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే జరగాలని ప్రజ్ఞాభారతి ఛైర్మన్‌ టి.హనుమాన్‌చౌదరి చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2030 కల్లా విద్యాభారతమే లక్ష్యం"

Post a Comment