మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పు వైఎస్ఆర్ అక్షయపాత్ర
- వంట కార్మికుల వేతనం 3వేలకు పెంపు:
విద్యాశాఖపై సీఎం జగన్ తొలి సమీక్ష
అమరావతి :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన పధకంలో సన్నబియ్యం ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన జగన్ అధికారిక హోదాలో శుక్రవారం విద్యాశాఖపై ప్రాథమికంగా తొలిసమీక్ష నిర్వహించారు.
విద్యావ్యవస్థ చక్కగా నడిచినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ఇందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు
ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మరలా సమావేశం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.
మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయపాత్రగా ముఖ్యమంత్రి ప్రకటించారు. నాణ్యంగా ఆహార పదార్థాలు రవాణా చేయడం, పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆహారం సకాలంలో తాజాగా పాఠశాలలకు చేరేలా వంటశాలల ఏర్పాటు పరిధి తగ్గించుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు నెలకు రూ.1000 నుంచి రూ.3,000కు పెంచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30లక్షల మంది విద్యార్ధులు పూర్తిస్థాయిలో పాఠశాలలకు హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
పాఠశాలలో సురక్షితమైన మంచినీరు, ఫర్నీచర్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, ప్రహరీ గోడలు వంటి మౌలిక సౌకర్యాలను సమకూర్చడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
విద్యార్ధి ఇష్టపూర్వకంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా ఆసక్తిని పెంపొందించేలా అభివృద్ధి చేయాలని అందుకు తగ్గ ఆర్ధిక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్, అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు
0 Response to " మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పు వైఎస్ఆర్ అక్షయపాత్ర"
Post a Comment