శాశ్వత బదిలీలు ఇంకెప్పుడు?* తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల శాశ్వత బదిలీలపై ప్రభుత్వాల తాత్సారం

*
ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు 1,776 మంది ఉద్యోగుల దరఖాస్తులు
ఏపీకి వెళ్లేందుకు 1661 మంది సిద్ధం 
ఏపీ ఎస్‌ఆర్‌ డివిజన్‌లో పెండింగ్‌లో ఫైళ్లు
ఇంకా ఎన్‌వోసీలు ఇవ్వని ఏపీ సర్కారు
ఎన్‌వోసీలతో చేతులు దులుపుకొన్న తెలంగాణ

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల శాశ్వత బదిలీ అంశం ఎటూ తేలడం లేదు. నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నా.. ఏ రాష్ట్రమూ చొరవ చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్‌వోసీలు ఇచ్చి చేతులు దులిపేసుకోగా, ఏపీ ప్రభుత్వం దరఖాస్తులను కూడా పరిశీలించకుండా మూలన పెట్టింది. శాశ్వత బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో, ఏపీ ప్రభుత్వం అక్టోబరులో నోటిఫికేషన్లు జారీ చేశాయి. దీంతో ఏపీనుంచి తెలంగాణకు రావడానికి 1776 మంది వివిధ కేటగిరీల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లడానికి 1661 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. తెలంగాణలో విభాగాధిపతులకు వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు నివేదించారు. వారు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు పంపించారు. జీఏడీ, ఆర్థిక శాఖలోని ఎస్‌ఆర్‌(స్టేట్‌ రీ-ఆర్గనైజేషన్‌) విభాగం.. దరఖాస్తులను పరిశీలించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అనుమతితో మొత్తం 1661 మంది దరఖాస్తుదారులకు నిరభ్యంతర పత్రాలు(ఎన్‌వోసీ) జారీ చేశాయి. ఇందులో ఉపాధ్యాయులు 578 మంది, పోలీసులు 550 మంది, హోంగార్డులు 300 మంది, వ్యవసాయ శాఖ ఉద్యోగులు 59 మంది, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 13 మంది, ఐసీడీఎస్‌కు చెందినవారు 20 మంది ఉన్నారు. 
ఏపీ నుంచి రాని అనుమతి..బదిలీ కోరుకున్న ఉద్యోగుల ఎన్‌వోసీలను తెలంగాణ అధికారులు ఏపీ ప్రభుత్వానికి పంపించారు. వీరిని రిలీవ్‌ చేయాలా, వద్దా అన్నది తెలపాలంటూ ఏపీ నుంచి అనుమతి(కాన్సెంట్‌)ని కోరారు. కానీ, ఇంకా అక్కడి నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. మరోవైపు ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి 1776 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ స్థానికత ఉన్నవారు 587 మంది కాగా, మిగతావారు ఇతర కారణాలతో బదిలీ కోరుకునే ఏపీ స్థానికత కలిగినవారు ఉన్నారు. 1776 మందిలో టీచర్లు 171 మంది, హోంశాఖకు చెందినవారు 94 మంది, ఎక్సైజ్‌ శాఖకు చెందినవారు 80 మంది, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 53 మంది, వ్యవసాయ శాఖ ఉద్యోగులు 44 మంది, సెక్రటేరియట్‌ ఉద్యోగులు 43 మంది, మునిసిపల్‌ శాఖకు చెందినవారు 40 మంది, జూనియర్‌ లెక్చరర్లు 28 మంది, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు ఆరుగురు, మిగతావారు ఇతర శాఖల నుంచి ఉన్నారు. ఇప్పటికే వీరి దరఖాస్తులను ఏపీ స్టేట్‌ రీ-ఆర్గనైజేషన్‌(ఎస్‌ఆర్‌) విభాగానికి పంపించారు. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్న అక్కడి ఎస్‌ఆర్‌ డివిజన్‌ తమ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిందని తెలంగాణకు రావాలనుకుంటున్న ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు ఎన్‌వోసీలు జారీ చేయకపోగా,  తెలంగాణ నుంచి పంపించిన ఎన్‌వోసీలను కూడా పెండింగ్‌లో పెట్టారని చెబుతున్నారు. ఆరు నెలలుగా ఇవి పరిష్కారానికి నోచుకోవడం లేదని పేర్కొంటున్నారు. తెలంగాణ జీఏడీ అధికారులు ఏపీ జీఏడీ అధికారులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి, దరఖాస్తులను పరిశీలిస్తే సమస్యకు పరిష్కారముంటుందని ఉద్యోగులు చెబుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "శాశ్వత బదిలీలు ఇంకెప్పుడు?* తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల శాశ్వత బదిలీలపై ప్రభుత్వాల తాత్సారం"

Post a Comment