2021 మొదట్లో చంద్రయాన్-3
- చంద్రయాన్-2లో లాగా ఆర్బిటర్ ఉండదు
- ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి
- గగన్యాన్ సన్నాహాలు సాగుతున్నాయి
- కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: వచ్చే ఏడాది మొదట్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం తెలిపారు.
ఒకరకంగా చెప్పాలంటే.. ఇది చంద్రయాన్-2ను పునరావృతం చేయడమేనని, అయితే, ఆ ప్రాజెక్టులోలాగా ఇందులో చంద్రుడి కక్ష్యలో తిరిగే ఆర్బిటర్ ఉండదని కేవలం లాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని ఆయన వివరించారు.
2008లో చేపట్టిన చంద్రయాన్-1 ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. చంద్రుడి ధ్రువాల వద్ద తుప్పు లాంటిది కనిపిస్తోందని ఆయన చెప్పారు. చంద్రుడిపై ఇనుము అధికంగా గల శిలలు ఉన్నట్టు తెలిసినా.. నీళ్లు, ఆక్సిజన్ ఉన్నట్టు పూర్తిగా రుజువు కాలేదని, కానీ, ఇనుము తుప్పు పట్టడానికి ఆ రెండూ కావాలని మంత్రి గుర్తుచేశారు. దీంతోపాటు..
భారతదేశపు తొలి మానవ సహిత రోదసి యాత్ర ‘గగన్యాన్’కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని జితేంద్ర సింగ్ తెలిపారు. కరోనా వల్ల గగన్యాన్ ప్రణాళికలకు కొంత విఘాతం కలిగినా నిర్ణీత సమయానికే దాన్ని నిర్వహించేందుకు శాస్త్రజ్ఞులు కృషిచేస్తున్నారని చెప్పారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మిషన్లో ల్యాండర్ విఫలమైనా..
ఆర్బిటర్ మాత్రం విజయవంతమైంది. అది ఇప్పటికీ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతూ, చంద్రుడి గురించి కీలకమైన సమాచారాన్ని పంపుతూ తన పని తాను చేసుకుపోతోంది
0 Response to "2021 మొదట్లో చంద్రయాన్-3"
Post a Comment