కరోనా ఎఫెక్ట్ : సామాన్యుడికి ఆర్బీఐ ఊరట
కరోనా ఎఫెక్ట్ : సామాన్యుడికి ఆర్బీఐ ఊరట
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు
ముంబయి: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడికి ఊరట కలిగించే అంశాల్ని ప్రకటించింది. అన్ని రకాల టర్మ్లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల రుణాలు తీసుకున్నవారి క్రెడిట్ హిస్టరీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని హామీ ఇచ్చింది. అలాగే రెపోరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రివర్స్ రెపోరేటును 90 పాయింట్లకు కుదించింది. దీంతో ప్రస్తుతం రెపోరేటు 4.4 శాతం, రివర్స్ రెపోరేటు 4 శాతానికి చేరింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని సైతం 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం సీఆర్ఆర్ 3శాతానికి చేరుకుంది. ఇక వ్యాపార వర్గాలకు కూడా ఊరట కల్పించే అంశాన్ని ముందుకు తెచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ లోన్లపై వడ్డీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకులకు సూచించింది. దీంతో వడ్డీ భారం తగ్గి నష్టాల తీవ్రత నుంచి వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. మార్చి 24-26 మధ్య జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాల్లో తాజా పరిస్థితులను పూర్తిగా సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.
బ్యాంకుల్లో డబ్బులు భద్రం...
తాజా చర్యలతో రూ.3.74 లక్షల కోట్లు మార్కెట్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం పటిష్ఠంగా ఉందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రజలు నగదు ఉపసంహరణ(విత్డ్రా) విషయంలో ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన విధాన సమీక్ష తర్వాత మార్కెట్లోకి దాదాపు రూ.2.7లక్షల కోట్లు విడుదల చేశామని తెలిపారు.
CLICK HERE TO DOWNLOAD RBI STATEMENT
పరిస్థితి కొనసాగితే మరింత ప్రమాదం..
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శక్తికాంతదాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి, దాని తీవ్రత ఎంతకాలం కొనసాగనుందన్న అంశాలపైనే భవిష్యత్తు వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయని స్పష్టం చేశారు. కరోనాతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ గుర్తుచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో మునుపెన్నడూ లేనంత అస్థిరత నెలకొందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నిరుపేదలను ఆదుకోవడానికి ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మరుసటి రోజే ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. వచ్చే మూడు నెలల పాటు ఉద్దీపన పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు.
ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు...
> టర్మ్లోన్ల ఈఎంఐలపై 3 నెలల మారటోరియం
> రెపోరేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం ఇది 4.4 శాతానికి చేరింది
> రివర్స్ రెపోరేటు 90 బేసిస్ పాయింట్లు తగ్గింపు. దీంతో ప్రస్తత రివర్స్ రెపో రేటు 4శాతానికి తగ్గింది.
> బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తిని(సీఆర్ఆర్) 100 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో సీఆర్ఆర్ 3శాతానికి చేరింది. దీంతో రూ.1.37 లక్షల కోట్లు మార్కెట్లోకి విడుదల చేసే వెసులుబాటు కలుగుతుంది.
> లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ(ఎల్ఏఎఫ్) 90 బేసిస్ పాయింట్లు తగ్గింపు. ప్రస్తుత ఎల్ఏఎఫ్ 4శాతానికి చేరిక
అయితే తాజా ఆర్బీఐ నిర్ణయం వెలువడిన తరువాత పలువురు వినియోగదారుల్లో క్రెడిట్ కార్డు రుణాల పరిస్థితిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని స్పష్టం చేసింది. ఆయా చెల్లింపులను నిబంధనల ప్రకారం వినియోగదారులకు తప్పకుండా చెల్లించాలని తెలిపింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది. దీంతో ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆశించిన క్రెడిట్ కార్డు వినియోగదారులు ఉసూరుమన్నారు. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు)
మరోవైపు ఆర్ బీఐ తాజా నిర్ణయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. అటు ఆర్బీఐ కల్పించిన వెసులుబాట్లపై అటు మార్కెట్ వర్గాలు, ఇటు విశ్లేషకులు కూడా సంతోషాన్ని ప్రకటించారు
0 Response to "కరోనా ఎఫెక్ట్ : సామాన్యుడికి ఆర్బీఐ ఊరట"
Post a Comment