నిమిషాల్లో ఆధార్‌ కార్డు

రోజుకు వెయ్యిమందికి సేవలు

శని, ఆదివారాల్లోనూ పని వేళలు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు

బయోమెట్రిక్‌ తీసుకుంటూ..



మీరు కొత్తగా ఆధార్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా...? అందులో పేరు మార్చాలనుకుంటున్నారా...? లేదా చిరునామా సరి చేసుకోవాలని అనుకుంటున్నారా...? చిన్నారులకు ఆధార్‌ చేయాలనుకుంటున్నారా...?

ఈనాడు,విశాఖపట్నం: ఇలాంటి సేవలను సులువుగా.. నిరీక్షణ లేకుండా వెంటనే అందించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధార్‌ సేవా కేంద్రం ఇటీవలే ప్రారంభమైంది. ద్వారకానగర్‌ మొదటి వీధిలో దీన్ని ఏర్పాటు చేశారు

ఏ సేవలైనా గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. అదనపు రుసుము చెల్లించాల్సిన పని లేకుండా సేవలను పొందొచ్ఛు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, మీ-సేవా కేంద్రాల ద్వారా ఈ సేవలందుతున్నా.. కొన్నిచోట్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మరికొన్నిచోట్ల మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రయివేటు నిర్వాహకులు డబ్బులు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం భారీ ఆధార్‌ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోజుకు వెయ్యిమందికి సేవలందేలా ఏర్పాట్లున్నాయి.

ఉచిత సేవలు..

● మొదటిసారిగా ఆధార్‌ కార్డు తీసుకునే వ్యక్తులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

● పిల్లల బయోమెట్రిక్‌ క్రమబద్ధీకరణ ఉచితమే. ● మిగిలిన సేవలకు.. పేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు, పుట్టిన తేదీ వంటి వివరాల మార్పు, నమోదుకు రూ. 50 చెల్లించాలి

ఇదీ ప్రత్యేకత..: మీ - సేవలు, గుర్తించిన బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ఆధార్‌ కార్డు వెంటనే ఇవ్వరు. మనం ఇచ్చిన చిరునామాకు పోస్టల్‌ ద్వారా వస్తుంది. అదే కేంద్ర ఆధార్‌ సేవా కేంద్రంలో నిమిషాలో కార్డు తీసుకోవచ్ఛు అదనంగా రూ. 30 చెల్లించాలి. ఆ తరువాత పోస్టల్‌ ద్వారా కూడా అందుతుంది. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే కొరియర్లో కార్డు ఇంటికే వస్తుంది.

వృద్ధులు..వికలాంగులు: చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు వస్తే.. నిరీక్షించే పని లేకుండా వెంటనే సేవలందిస్తారు. వీరు కార్యాలయంలోకి రావడానికి లిఫ్టు సౌకర్యం కూడా ఉంది. దేశంలో ఎవరైనా, ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరైన ధ్రువీకరణపత్రాలతో వస్తే ఆధార్‌ సేవలందుతాయి. తగిన ఆధారాలతో వస్తే ప్రవాసాంధ్రులకూ చేయిస్తారు.

సువిశాల ప్రాంగణంలో..

ద్వారకానగర్‌ మొదటి వీధి గ్రాండ్‌ ప్యాలెస్‌ భవనం మూడో అంతస్తులో 3,843 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సేవా కేంద్రాన్ని నిర్మించారు. శని, ఆదివారాల్లోనూ పని చేస్తుంది. పని వేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

16 డెస్క్‌లతో..: ● రోజుకు కనీసం వెయ్యి మందికి సేవలందుతాయి.

*●ప్రస్తుతం 25 మంది సిబ్బంది ఉన్నారు. 8 నిర్వహణ డెస్క్‌లు, మూడు పరిశీలన, మరో మూడు సహాయక డెస్క్‌లున్నాయి. దీన్ని 16 డెస్క్‌లకు విస్తరించనున్నారు.

*●●ఆధార్‌ సేవల కోసం వచ్చేవారు తొలుత హెల్ప్‌డెస్క్‌ వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవచ్ఛు

*● ●అపాయింట్‌మెంట్‌ డెస్క్‌ వద్ద వివరాలు అందజేస్తే ఏ నెంబరు డెస్క్‌కు వెళ్లాలో తెలియజేస్తారు.

*● ●ఆ తరువాత సమర్పించిన పత్రాలను తనిఖీ సిబ్బంది చూసి చివరిగా బయోమెట్రిక్‌కు పంపుతారు.

ఆన్‌లైన్‌లోనూ..: ఆన్‌లైన్‌లో uidai.gov.in లోకి వెళ్లి బుక్‌ అపాయింట్‌మెంట్‌లో విశాఖపట్నం సేవా కేంద్రం క్లిక్‌ చేసి ఫోన్‌ నంబరు ఇస్తే వచ్చే సమాచారం ఆధారంగా మనం ముందుగానే టోకెన్‌ తీసుకునే సౌకర్యం పొందొచ్ఛు కార్యాలయ ఆవరణలో ఆధార్‌ స్కాన్‌ను మన మొబైల్‌ ఫోన్‌లో స్కాన్‌ చేసి ఆ వెంటనే వచ్చే వివరాలు ఆధారంగా టోకెన్‌ పొందొచ్ఛు

సత్వర సేవలకు..

విశాఖలో వేగవంతమైన సేవలందించడానికి కొద్ది రోజుల కిందటే ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించాం. ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలు అందిస్తున్నాం. ప్రజలు ఎక్కువ సమయం నిరీక్షించకుండా వారి పని పూర్తి చేసి వెంటనే పంపించేలా ప్రత్యేక డెస్క్‌లు పనిచేస్తాయి. శని, ఆదివారాల్లోనూ సేవలందిస్తాం. - రికేష్‌ కుమార్‌, సేవా కేంద్రం మేనేజర్‌


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిమిషాల్లో ఆధార్‌ కార్డు"

Post a Comment