ఈ బడ్జెట్తో మేలెవరికి, చేటు ఎవరికి..!
ప్రయోజనం పొందే రంగాలు
రవాణా మౌలికసదుపాయాలు
జాతీయ రహదారులు, రైల్వేల మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరుగులు పెట్టించేలా సీతారామన్ పలు ప్రణాళికల్ని ఆవిష్కరించారు. రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాదాపు రూ.1లక్షా72వేల కోట్లు ప్రతిపాదించారు. 12 జాతీయ రహదారులను మానిటైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సంస్థలు లబ్ది పొందనున్నాయి.
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థలు
ప్రభుత్వం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమికండక్టర్లు, సహా మెడికల్ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలకు అనుకూలంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్రామీణ భారతానికే పెద్దపీట
గ్రామీణ, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో రూ.2.83లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాదికల్లా వ్యవసాయ రంగ రుణాలు రూ.15లక్షల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 500 మత్స్యకార ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ రంగంలోని సంస్థలకు సానుకూలంగా మారనుంది.
నీటి సదుపాయాల కల్పన
వ్యవసాయానికి నీటి సౌలభ్యం లేని ప్రాంతాల్లో సహకారం అందించే దిశగా చర్యలపై బడ్జెట్లో సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రైతులకు సోలార్ పంపుసెట్లను అందించే విషయమై చేసిన ప్రకటనతో ఆయా రంగానికి చెందిన సంస్థలు పుంజుకోనున్నాయి. అదేవిధంగా 2024కల్లా దేశంలో ఉన్న ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పించాలని సీతారామన్ బడ్జెట్లో రూ.3.6లక్షల కోట్లు ప్రకటించారు. దీని ద్వారా పైప్లైన్ రంగానికి చెందిన సంస్థలు లబ్ది పొందనున్నాయి. అదేవిధంగా స్వచ్ఛభారత్ మిషన్ కోసం రూ.12,300కోట్లు కేటాయించారు. మురుగు శుద్ధి ప్లాంట్లతో ఆ రంగం బలపడనుంది.
భారత్ బ్రాడ్బ్యాండ్కు నిర్ణయం..
గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా భారత్ నెట్ లేదా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.6వేల కోట్లను కేటాయించింది. దీని ద్వారా టెలికాం రంగంలోని సంస్థలు పుంజుకోనున్నాయి.
డేటా సెంటర్ల పార్కులకు ముందడుగు
ప్రైవేటు రంగానికి ఊతమిస్తూ దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు త్వరలో నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా అన్ని ఐటీ కంపెనీలు లబ్ది పొందనున్నాయి.
పైప్లైన్, సిటీ గ్యాస్ సరఫరాదారులు
దేశంలో ప్రస్తుతం ఉన్న 16,200 కిలోమీటర్ల జాతీయ గ్యాస్ గ్రిడ్ సదుపాయాన్ని 27వేల కిలోమీటర్లకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించింది. దీని ద్వారా పైప్లైన్ సరఫరా సంస్థలు, గ్రిడ్ పొడిగింపు గ్యాస్ సంస్థలకు అనుకూలంగా మారనుంది.
ప్రభావం చూపే రంగాలు
బీమా సంస్థలు
భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో కేంద్రం వాటాలను అమ్మకానికి ప్రకటన ఇచ్చింది. దీంతో ఇది 2019లో మంచి పనితీరు కనబరచిన ప్రైవేటు బీమా సంస్థల షేర్లలో ప్రభావం చూపించనుంది.
రాష్ట్రీయ బ్యాంకులు
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బ్యాంకులకు ఈసారి బడ్జెట్ మొండి చేయి చూపింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల పరిధిలోని బ్యాంకులకు బడ్జెట్లో ఎలాంటి నిధులను కేటాయించకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీని కారణంగా రాష్ట్రాల పరిధిలోని బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఎరువుల కంపెనీలు
జీరో బడ్జెట్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆమె ప్రతిపాదించారు. దీని ద్వారా రసాయన ఎరువుల తయారీ సంస్థలు ప్రభావితం కానున్నాయి.
లాజిస్టిక్స్
జాతీయ లాజిస్టిక్ విధానం కోసం ఆ రంగానికి చెందిన సంస్థలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఆ విధానం అమలు ఆలస్యం కావడంపై సంబంధిత సంస్థలు నిరాశకు గురయ్యాయి.
రియల్ఎస్టేట్, నిర్మాణ రంగం
డెవలపర్లకు రుణాలను పెంచమని, అదేవిధంగా అమ్మకాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టమని రియల్ఎస్టేట్ రంగం కోరింది. కానీ కేంద్రం బడ్జెట్లో ఆ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోవడంతో ఈ రంగంలోని సంస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు వస్తాయని అంచనాలు పెట్టుకున్న సంస్థలు ఎంతో నిరాశకు గురయ్యాయి
0 Response to "ఈ బడ్జెట్తో మేలెవరికి, చేటు ఎవరికి..!"
Post a Comment