డీఎస్సీపై డైలమా

  • ప్రహసనంగా 2018 నోటిఫికేషన్‌ నియామకాలు
  • 7902 ఖాళీల్లో ఇప్పటికి 2690 పోస్టులే భర్తీ
  • కోర్టు కేసులు పెండింగ్‌ అంటూ కాలయాపన
  • కొత్త నోటిఫికేషన్‌పై మౌనం... ‘టెట్‌’పైనా సందిగ్ధం
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ నియామకాలపైౖ అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. పాత డీఎస్సీ నియామకాలు ఎప్పటికి పూర్తి చేస్తారో.. కొత్త నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పటం లేదు. గత ప్రభుత్వం 2018 అక్టోబరు 26న డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌, రెసిడెన్షియల్‌, వెల్ఫేర్‌, మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 7,902 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన ఇచ్చింది. విద్యార్హతలతో పాటు రకరకాల కారణాలతో అభ్యర్థులు కోర్టుకెక్కారు. గత ప్రభుత్వ హయాంలోనే చాలా కేసులు ఓ కొలిక్కి వచ్చాయి.

 చిన్న, చిన్న కేసులు కొన్ని పరిష్కారం కాలేదు. ఈ లోగా సాధారణ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారటం వంటి పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం ఏదైనా టీచర్‌ పోస్టులను భర్తీచేయాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. పరీక్షల నుంచి ఫలితాల విడుదల వరకు తరచూ షెడ్యూల్స్‌ మారుస్తూ, సవరిస్తూ నిరుద్యోగుల ఉత్సాహంపై పాఠశాల విద్యాశాఖ నీళ్లు చల్లుతోంది. కోర్టు కేసుల కారణంగానే నియామకాలు ఆలస్యం అవుతున్నాయని పాఠశాల విద్యాధికారులు చెబుతున్నారు. కానీ దాదాపు 6 వేలకు పైగా టీచర్‌ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులేవీ లేకపోయినా నియామకాలు చేయడం లేదని సంబంధిత అభ్యర్థులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం... డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ ద్వారా 7,902 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం 2,690 పోస్టులనే భర్తీచేశారు.
 
కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుని, మిగిలిన ఖాళీలను కూడా భర్తీచేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా పాఠశాల విద్య పరిధిలోని జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ప్రభుత్వ, మోడల్‌, గురుకులాలతో పాటు మున్సిపల్‌ పాఠశాలల్లో దాదాపు 21వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా పోస్టులను డీఎస్సీ-2020 ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్‌పై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. పాత నోటిఫికేషన్‌ తాలూకు పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్‌ ఎలా? అనే సందిగ్ధత ప్రభుత్వవర్గాల్లో వ్యక్తమవుతోంది. కొత్త నోటిఫికేషన్‌ కంటే ముందుగా ‘టెట్‌’ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దీనిపైనా స్పష్టత ఇవ్వడం లేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " డీఎస్సీపై డైలమా"

Post a Comment