స్కూళ్ల అభివృద్ధికి 1500 కోట్లు



పనుల్లో నాణ్యత తగ్గకూడదు

మూడంచెల తనిఖీ.. నిబంధనలు పాటించని ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలపై చర్యలు

‘నాడు-నేడు’పై సమీక్షలో సీఎం ఆదేశాలు 




అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం జగన్‌ అన్నారు. దీనికోసం

ప్రత్యేకంగా రూ.1,500కోట్ల బడ్జెట్‌ కేటాయించిందని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెల తనిఖీ విధానం ఉండాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత తగ్గకూడదని స్పష్టం చేశారు. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణపై సీఎం సమీక్షించారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, కొంతమంది రూ.1000 కంటే ఎక్కువ ఇస్తున్నారని అధికారులు చెప్పారు. బడి అభివృద్ధిలో భాగస్వాములవుతున్న తల్లిదండ్రుల పేర్లు నోటీసుబోర్డులపై ఉంచాలని చేయాలని జగన్‌ సూచించారు. ఏప్రిల్‌ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీని అన్ని జిల్లాల్లో దశలవారీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చాలాచోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధిక పీజులపై దృష్టి పెట్టాలన్నారు. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్య, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల చైర్మన్లు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, అధికారులు పాల్గొన్నారు. 

నేడు ‘దిశ’ స్టేషన్‌ ప్రారంభించనున్న సీఎం 

రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను సీఎం జగన్‌శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 18దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దిశ పోలీస్‌ స్టేషన్లకు చెందిన అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ‘దిశ’ యాప్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం నన్నయ వర్సిటీలో దిశ చట్టంపై జరుగుతున్న వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. కాకినాడలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.48,69,372 బడ్జెట్‌తో నిర్మించనున్న ‘వన్‌ స్టాప్‌ సెంటర్‌’కు ఇక్కడనుంచే శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలోని అన్ని వన్‌స్టాప్‌ సెంటర్ల సిబ్బందితో సీఎం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు.

  ‘నాడు-నేడు’కు 400 కోట్లు

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ‘నాడు-నేడు’కు ప్రభుత్వం 400కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని గ్రీన్‌ఛానెల్‌ ద్వారా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "స్కూళ్ల అభివృద్ధికి 1500 కోట్లు"

Post a Comment