3 రాజధానులు 4 జోన్లు.. 25 జిల్లాలు

  • ప్రతి ప్రాంతంలో బోర్డు పాలన
  • జిల్లాల్లో సూపర్‌ కలెక్టర్‌ వ్యవస్థ
  • రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
  • హైపవర్‌ కమిటీ సూచనలకు ఓకే
  • ఆ వెంటనే దృశ్యం అసెంబ్లీకి
  • రాజధానుల బిల్లు పెట్టిన బుగ్గన
  • పూర్తిస్థాయి శాసనసభ, బెంచ్‌కు
  • ఇక ముందు అమరావతి పరిమితం
  • రాజధాని రైతుల సాగు అవసరాలకు 11 వేల భూసార కేంద్రాల ఏర్పాటు
  • పెన్షన్‌ 2,500 నుంచి 5 వేలకు పెంపు
  • సీఆర్డీయే రద్దు బిల్లుపెట్టిన బొత్స
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులు అన్న తమ కొత్త మాటపైనే ప్రభుత్వం ముందుకెళ్లింది. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా మార్చి, లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 జిల్లాలు ఏర్పాటు చేసేలా అడుగులు వేసింది. ఈ దిశగా రూపొందించిన రెండు బిల్లులను తొలుత రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా, ఆ వెంటనే వాటిని శాసనసభకు ప్రభుత్వం సమర్పించింది. టీడీపీ సభ్యుల తీవ్ర నిరసనలు, జై అమరావతి నినాదాలు రేపిన హైటెన్షన్‌ నడుమ హైపవర్‌ కమిటీ నివేదిక ఆధారంగా తయారుచేసిన ఈ బిల్లులను సోమవారం రాత్రి శాసనసభ ఆమోదించింది. మంగళవారం శాసనమండలి వాటిపై చర్చ చేపడుతుంది. అంతకుముందు.. 


సచివాలయంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నాలుగు ప్రాంతీయ కమిషనరేట్‌లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూపు (జీసీజీ) ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి మూడు రాజధానులపై ప్రభుత్వానికి హైపవర్‌ కమిటీ అందించిన నివేదికను కేబినెట్‌ ఆమోదించింది. రాజధాని అమరావతి నుంచి పరిపాలనా వ్యవస్థలో కీలకమైన సచివాలయం, రాజ్‌భవన్‌లను విశాఖకు తరలించడం ద్వారా ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ను అక్కడ ఏర్పాటుచేయాలని, అమరావతిలోని హైకోర్టును కర్నూలుకు తరలించడం ద్వారా న్యాయ రాజధానిగా రాయలసీమ జిల్లాకు మార్చాలని కేబినెట్‌ నిర్ణయించింది. పూర్తిస్థాయి శాసనసభ, హైకోర్టు బెంచ్‌కు అమరావతిని పరిమితం చేశారు. ఈ ప్రాంతాన్ని శాసన రాజధానిగా ఇకపై పిలవనున్నారు. వీటన్నింటికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే) రద్దు చేస్తూ, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఆర్‌)ని ఏర్పాటుచేస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. విజయవాడ - గుంటూరు - మంగళగిరి - తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ పరిధి ని ఈ బిల్లులో విస్తరించడం జరిగింది. రాజధాని ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా పదకొండువేలుకుపైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న హైపవర్‌ కమిటీ నివేదికను కేబినెట్‌ ఆమోదించింది. ఈ కేంద్రాల్లో భూసార పరీక్షలు నిర్వహించేలా ల్యాబ్‌ లను ఏర్పాటు చేస్తారు. రాజ ధాని నగర ప్రాంతంలో కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని, పింఛను రూ.2500 నుంచి రూ.5000కు పెంచాలని కేబినెట్‌ నిశ్చయించింది. 13 జిల్లాలను ప్రతి లోక్‌సభకూ ఒకటి చొప్పున 25 జిల్లాలుగా పెంచాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. జిల్లాల విభజన తర్వాత సూపర్‌ కలెక్టర్‌ వ్యవస్థను తీసుకురావాలనే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది

 
అమరావతికి ఇంతే..
కేబినెట్‌ ఆమోదించిన రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి,. సీఆర్డీయే చట్టం రద్దు బిల్లును పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో పాలనా కేంద్రీకరణ బిల్లులోని ముఖ్యాంశాలు...అమరావతి ఇకపై శాసన రాజధానిగా మాత్రమే ఉంటుంది. శాసనసభ మాత్రమే ఇక్కడ ఉంటుంది. విశాఖపట్నం పాలనా రాజధానిగా ఉంటుంది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్‌ అక్కడే ఏర్పాటవుతాయి. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది. హైకోర్టు, న్యాయ ట్రైబ్యునళ్లను ఇక్కడ ఏర్పాటుచేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటుచేస్తారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవల్‌పమెంట్‌ ఏరియా, విశాఖపట్నం మెట్రోపాలిటర్‌ రీజన్‌ డెవల్‌పమెంట్‌ ఏరియా, కర్నూలు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ ఏరియాలుగా వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ మెట్రోపాలిటన్‌ రీజన్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అఽథారిటీ చట్టం-2016కింద ఇవి ఏర్పడతాయి. అయితే ప్రభుత్వం అవసరాన్ని బట్టి ఈ రాజఽధానుల్లో మార్పు చేసే హక్కు కలిగి ఉంటుంది. భవిష్యత్తులో అవసరం అనుకుంటే...ఆయా కారణాలను లిఖితపూర్వకంగా చెప్పి తాము అనుకున్న మార్పులు చేయవచ్చు.
 
ప్రాంతీయ బోర్డులు
రాష్ట్రంలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థికమంత్రి బుగ్గన తెలిపారు. ప్రాంతీయ ప్రణాళిక-అభివృద్ధి బోర్డులుగా వీటిని వ్యవహరిస్తారు. ఎన్ని ప్రాంతీయ బోర్డులను ఏర్పాటుచేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బోర్డు ఎలా ఉండాలి? ఎలాంటి విధులు నిర్వర్తించాలన్నది ఈ చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. మూడు అధికారాలను ఈ బోర్డులకు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు. అవి 1) తమ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన నివేదికలన్నీ బోర్డు అడుగుతుంది. 2) ఆయా జోన్లలోని అభివృద్ధి ప్రణాళికల తయారీ, అమలు. 3) ఆయా అభివృద్ధి ప్రణాళికల సమీక్ష. ఇవి కాకుండా అవసరం అనుకున్న అధికారాలను కూడా ప్రభుత్వం కాలానుగుణంగా బోర్డులకు ఇవ్వొచ్చు. ఆయా జోనల్‌ బోర్డులు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలను అమలుచేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
 
అవసరాన్ని బట్టి ఈ నిధులు సర్దుబాటు చేయాలి. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇతర చట్టాలన్నింటినీ అధిగమించి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఈ బిల్లులోని అంశాల అమలుకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. వాటిని తొలగించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ చట్టంలోని అంశాలను అమలయ్యేందుకు వీలుగా రెండేళ్లలోపు అధికారిక గెజిట్‌లో ప్రచురిస్తారు. ఈ చట్టం అమలుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తారు. ఈ బిల్లులోని ప్రతి అంశం, చట్టం రూపొందిన వెంటనే అమల్లోకి వస్తుంది. బోర్డు విధులిలా.. ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలను, ప్రాజెక్టులను రూపొందిస్తుంది. వాటిని అమలుచేసి, పర్యవేక్షిస్తుంది. ఆ ప్రణాళికలకు అవసరమైన నిధులు సమీకరిస్తుంది. ఆయా జోన్లలో బాగా వెనుకబడిన ప్రాంతాలుంటే వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలను సూచిస్తుంది.
 
‘మూడు’పై బుగ్గన మాట
‘‘1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక, 1969లో తెలంగాణ ఉద్యమం, 1971లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అభివృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందలేదనే భావనతోనే ఈ ఉద్యమాలు వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఎక్కడ ఏర్పాటుచేయాలన్నదానిపై శివరామకృష్ణన్‌ కమిటీ వేశారు. అయితే ఆ తర్వాత రాజధాని నిర్ణయం అన్నది అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించే విధంగానే జరిగింది. అందుకే అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధి చెందేలా నిపుణుల కమిటీని, బోస్టన్‌ కన్సల్టెంట్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేశాం. ఈ రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేసేందుకు హైపవర్‌ కమిటీ వేశాం. హైపవర్‌ కమిటీ 4 సూచనలు చేసింది. చారిత్రకంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు భిన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, అభివృద్ధి అంశాలు కలిగి ఉన్నాయి. ప్రాంతీయఅసమానతలు, సమానాభివృద్ధి లేకపోవడం... రాష్ట్రంలో అలజడి రేకెత్తించాయి. వికేంద్రీకృత పాలన ద్వారానే ఈ సమస్యలకు సమాధానం చెప్పవచ్చు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకృత పాలనకు తెరతీయాలి.. అనేవి ఆ 4 సూచనలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైపవర్‌ కమిటీ సూచనలను ఆమోదించింది. రాజ్యాంగంలోని 38వ ప్రకరణం ప్రకారం అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి కోసం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, విధులను అన్ని ప్రాంతాలకు బదిలీ చేసేందుకు వీలుగా దీనిని రూపొందించాం.’’
 
నోటీసు తీసుకోని స్పీకర్‌.. టీడీపీ నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను వైసీపీ స్వాగతించింది. వాటిని టీడీపీ వ్యతిరేకించింది. సభ ప్రారంభానికి ముందే ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు టీడీపీ సభ్యులు నోటీసు ఇచ్చారు. తమ నోటీసుపై స్పందించాలంటూ వారు స్పీకర్‌ను కోరారు. తనకున్న విచక్షణాధికారంతో ఆ నోటీసును తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ సభలో ప్రకటించారు. దీనిపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతే కావాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు కోరారు. స్పీకర్‌ అందుకు అనుమతించకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద కొంతసేపు నిలబడ్డారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " 3 రాజధానులు 4 జోన్లు.. 25 జిల్లాలు"

Post a Comment