ఉద్యోగులకు రాజకీయాలెందుకు?

  • అభివృద్ధికి సహకరించండి: మంత్రి కన్నబాబు
కాకినాడ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాలకు రాజకీయాలు అవసరమా? అని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఉద్యోగ జేఏసీలు ఏర్పడింది ధర్నాలు చేయడానికి కాదని, తమ సమస్యల పరిష్కారానికి మాత్రమేనని అన్నారు. ఏ ఉద్యోగీ పార్టీ జెండాలతో తిరగకూడదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, తద్వారా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. విఽధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేయాలన్నారు. అలాంటి వారిని సత్కరించడానికి సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు తమ పరిధి దాటకూడదని సూచించారు.
 
ప్రతిదాన్నీ రాజకీయాలు చేయకుండా తోటి ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి న్యాయం చేయాలని సంఘాలకు సూచించారు. ఉద్యోగులకు ఉద్యోగులే శత్రువులని, అలా కాకుండా సంఘాలన్నీ సంఘటితంగా ఉండాలని సూచించారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో కారుణ్య నియామకాలు తప్ప, కొత్త ఉద్యోగాలు రాలేదని, జగన్‌ సీఎం కాగానే 4నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ, 2010లో తమ సంఘాన్ని రిజిస్ర్టేషన్‌ చేయించామని, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు, కార్యదర్శి శ్రీకాంత్‌రాజు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఉద్యోగులకు రాజకీయాలెందుకు?"

Post a Comment