ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు...వెనక్కి తగ్గకుండా

నేడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవయుగకు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 






అలాగే కాంట్రాక్టర్‌ కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంతేకాక మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు, మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది

అంతేకాక మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం పేర్కొంది. ఇక ఈ పోర్టు భూముల లీజు కూడా చెల్లించలేదని కేబినెట్‌కు పరిశ్రమల శాఖ తెలిపింది. ఇసుకరీచ్‌లు, నూతన ఇసుక విధానం, ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ అందించిన నివేదికపైనా కీలక చర్చ జరగనుంది.


Additional information

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, కొత్త ఇసుక విధానానికి మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఇసుక విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇసుక ధరను టన్ను ధర రూ.375గా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 58 ఇసుక స్టాక్‌పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏపీఎండీపీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాజకీయ ప్రమేయం లేకుండా ఇసుక రీచ్‌లను నిర్వహించాలని సీఎం సూచించారు

దశల వారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది.

మరోవైపు ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ ప్రధానంగా 5 రకాల ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ప్రజా రవాణా విభాగం ఏర్పాటు చేసి అందులోకి తీసుకోవడం, సంస్థను 5 భాగాలుగా విభజించడం, విలీనం చేయకుండా ప్రతి నెలా ప్రభుత్వం తరఫున కొంత సాయం అందించడంతోపాటు మరో 2 ప్రతిపాదనలను చేసింది. వీటి ఆధారంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంతో ప్రజా రవాణా విభాగంలోకి ఆర్టీసీ ఉద్యోగులను తీసుకునే ప్రక్రియ వేగం అందుకోనుంది. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయనుంది. 15 రోజుల్లో విధివిధానాలు సిద్ధమవుతాయి. ఆర్టీసీలోని 53వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెరగనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు...వెనక్కి తగ్గకుండా "

Post a Comment