అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ



అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ 

జాబితాలో లేని వాటికీ చికిత్స 
గిరిజన ఆశ్రమ విద్యార్థులకూ పథకం వర్తింపు 
కుష్ఠు, కిడ్నీ వైఫల్య రోగులకూ పింఛను 
వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయాలు 
త్వరలో ముఖ్యమంత్రి అనుమతితో అమలు 
అవయవ మార్పిడికి ఉచితంగా మందుల పంపిణీ 
ఈనాడు - హైదరాబాద్‌


అనారోగ్యంతో ఆసుపత్రికెళ్తే.. కేవలం ఆరోగ్యశ్రీ పథకం జాబితాలో పేర్కొన్న జబ్బు లేని కారణంగా చికిత్సకు నిరాకరించడం ఇక కుదరదు. ఏ జబ్బుతో ఆసుపత్రికెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తించేలా వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సుమారు లక్ష మంది విద్యార్థులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని నిర్ణయించింది.

ఆ ఒప్పందాన్ని గిరిజన సంక్షేమ శాఖతో త్వరలో వైద్యారోగ్యశాఖ కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే బోదకాలు, హెచ్‌ఐవీ బాధితులకు పింఛను విధానాన్ని అమలు చేస్తుండగా.. కుష్టు, కిడ్నీ వైఫల్య బాధితులకూ పింఛను పథకాన్ని వర్తింపజేయాలని తాజాగా ప్రతిపాదనలు రూపొందించింది. దీర్ఘకాలం అవస్థలు పడే ఈ బాధితులకు పింఛను అందించడం ద్వారా వారికి ఊరట లభించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదంతో త్వరలోనే తాజా నిర్ణయాలను అమల్లోకి తీసుకురానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.






జాబితాలో లేని వాటికి కనీస ధర 
ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం సుమారు వెయ్యికి పైగా జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో సుమారు 200 వరకే దాదాపు 70శాతం చికిత్సలు పొందుతున్నట్లుగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 100 వరకు జబ్బులకు ఒక్కసారి కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించినట్లుగా గత పదేళ్లలో నమోదవలేదు. ఇలా ఒక్కసారి కూడా చికిత్సకు నమోదవని జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తొలగించాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కొందరు ఇటీవల వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రతిపాదించారు. ఇప్పటికే జాబితాలో పొందుపర్చిన

జబ్బులను తొలగిస్తే.. భవిష్యత్‌లో వాటి చికిత్సలు అవసరమైన సందర్భాల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉన్న జాబితాను కొనసాగిస్తూ అదనంగా జబ్బులను చేర్చే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. కొన్నిరకాల జబ్బులకు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స లభించడం లేదనే అంశం చర్చకొచ్చింది.


* ఉదాహరణకు మూత్రపిండాల వైఫల్యంతో చికిత్సకు వస్తే.. రోగికి అప్పటి పరిస్థితుల దృష్ట్యా రక్తశుద్ధి (డయాలసిస్‌) అవసరం లేకపోవచ్చు. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రక్తశుద్ధి చికిత్స పొందితేనే.. ఆ రోగికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మరికొంతకాలం ఆ రోగి రక్తశుద్ధి చికిత్స వరకు తన అనారోగ్యం దిగజారకుండా కాపాడుకోవడానికి సాధారణ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోతే ఆరోగి పరిస్థితి ఏమిటి? 

* అలాగే ఛాతీలో నొప్పితో ఆసుపత్రికి వస్తే.. యాంజియోగ్రామ్‌ చేయాల్సి వస్తుంది. కానీ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్‌ అప్పుడే వేయాల్సిన పరిస్థితులు అన్నిసార్లూ ఉండవు. ఇలాంటప్పుడు స్టెంట్‌ వేయలేదు కాబట్టి ఆ రోగికి ఆరోగ్యశ్రీ వర్తించదంటే ఎలా? 
* ఈ తరహాలో సుమారు వందకుపైగా రకల జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకుండా ఉండడంతో రోగులు సొంతంగా తమ జేబుల్లోంచి ఖర్చుపెట్టుకోవాల్సిన దుస్థితులున్నాయి. వైద్యమంత్రి వద్ద భేటీలో ఇంత సవివరంగా ఉన్నతాధికారులు చర్చించారు. చివరకు ఆరోగ్యశ్రీ జాబితాలో లేని జబ్బులకూ ఉచితంగా చికిత్స అందించాలని తీర్మానించారు. అన్నిరకాల జబ్బులనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి, జాబితాలో లేని జబ్బులకు పరిమిత పరిధి మేరకు కనీస ఖరీదును నిర్ణయించాలని ప్రతిపాదించారు. 


* ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఏటా సుమారు రూ.800 కోట్లు ఖర్చవుతుండగా.. జాబితాలో లేని జబ్బులకూ చికిత్స అందించడం ద్వారా అదనంగా మరో రూ.100 కోట్ల వరకూ వ్యయమయ్యే అవకాశముందని అంచనాకు వచ్చారు. 
* జాబితాలో లేని జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించే విధానాన్ని తొలుత ప్రభుత్వ ఆసుపత్రులకే వర్తింపజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారు. 
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకంలో ఎటువంటి చికిత్స చేసినా.. వాటి ధరల్లో కోత పెట్టకుండా మంజూరు చేయాలని కూడా ప్రతిపాదించారు.


అవయవ మార్పిడికి ఉచిత ఔషధాలు 
* ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఇప్పటివరకు మూత్రపిండాల మార్పిడి పొందిన బాధితులకు మాత్రమే జీవితాంతం అవసరమైన ఔషధాలను అందజేస్తుండగా.. ఈ నిబంధనను సడలించి గుండె, కాలేయ మార్పిడి పొందిన రోగులకూ అందజేయనున్నారు. 


* ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఉన్న ఆసుపత్రుల్లో కొన్నేళ్లుగా ఒక్క కేసు కూడా చికిత్స చేయని ఆసుపత్రులుంటే వాటిని తొలగించాలని నిర్ణయించారు. 
* ఈ పథకం అమలుకు ముందుకొచ్చే కొత్త ఆసుపత్రులనూ ప్రోత్సహించి, నిబంధనల మేరకున్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించనున్నారు. 

* ప్రస్తుతమున్న వినికిడి యంత్రం ఖరీదు రూ.10వేలుండగా.. దీని స్థానంలో డిజిటల్‌ వినికిడి యంత్రాన్ని ప్రవేశపెట్టి దానికి రూ.15వేలు చెల్లించనున్నారు. 
* ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద వచ్చే చికిత్సలకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెల్లింపులు నిలిపివేయనున్నారు. 
* ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద పేరుకుపోయిన బకాయిల చెల్లింపుల కోసం ట్రస్టు నిల్వ నిధి నుంచి తాత్కాలిక ప్రాతిపదికన రూ.23 కోట్లు మంజూరు. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు నిధులు రాగానే తిరిగి సర్దుబాటు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ"

Post a Comment