ఏపీలో కొలువుల జాతర : లక్ష 33 వేల ఉద్యోగాలకు జులై 25 నోటిఫికేషన్, సెప్టెంబర్ 1 పరీక్ష

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సచివాలయాల ఉద్యోగాలకు జూలై 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 1న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర చరిత్రలో ఒకే విడతలో లక్షా 33 వేల 494 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వీటిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్పడంతో పాటు రాత పరీక్ష విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జులై 25, 2019 న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. పరీక్ష విధానం, విద్యార్హతలు అందులో మెన్షన్ చేస్తారు.

పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన 12 శాఖల ఉన్నతాధికారులు రోజూ సమావేశమవుతున్నారు

ఈ ఉద్యోగాలకు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగస్తులు కూడా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అవసరమైతే రెండు రోజుల పాటు (సెప్టెంబర్‌ 2 కూడా) రాత పరీక్షలు నిర్వహించాలని అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. ఒకే రోజు పరీక్ష నిర్వహించేందుకే మెజార్టీ అధికారులు మొగ్గు చూపుతున్నారు. రాత పరీక్షను పూర్తిగా మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో నిర్వహిస్తారు. అధికారులు అందించిన సమాచారం మేరకు 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 75 మార్కులకు జనరల్‌ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.

ప్రతీ గ్రామంలో సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఒక్కో గ్రామ సచివాలయంలో 10మంది ఉద్యోగులను నియమిస్తారు. పంచాయతీకి ఒకటి చొప్పున 13వేల 65 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2వేల కంటే అదనపు జనాభా కలిగిన పంచాయతీల్లో అనుంబంధ సచివాలయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో అదనంగా 1,800 అనుబంధ సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి.

గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.. వార్డు సచివాలయాల ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ప్రతి 4వేల జనాభా ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 775 వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.




వార్డు సచివాలయాల్లో పోస్టులకు డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ డిప్లొమాను విద్యార్హతగా నిర్ణయించింది ప్రభుత్వం. ఒక్కో వార్డు సచివాలయంలో 10 పోస్టుల చొప్పున 37వేల 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో సచివాలయంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి ఆరుగురు.. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నలుగురు బాధ్యతల నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో వార్డు కార్యదర్శి పోస్టుతోపాటు.. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్య, ప్రణాళిక-క్రమబద్ధీకరణ, వెల్ఫేర్ డెవలప్‌మెంట్, ఇంధన, ఆరోగ్య, రెవెన్యూ, మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టులు ఉన్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "ఏపీలో కొలువుల జాతర : లక్ష 33 వేల ఉద్యోగాలకు జులై 25 నోటిఫికేషన్, సెప్టెంబర్ 1 పరీక్ష"

Post a Comment