ఉపాధ్యాయ విద్యలో సమూల మార్పులు
అత్యంత ప్రతిభావంతులకే ‘గురువు’లయ్యే అవకాశం
పాఠశాల విద్యలో జాతీయ, మాతృభాషలకు పెద్దపీట
ఆంగ్లానికి తక్కువ ప్రాధాన్యం
ఎంబీబీఎస్ పూర్తిచేశాక.. జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పరీక్ష
జాతీయ నూతన విద్యా విధానం-2019లో సంస్కరణలు
ఈనాడు - హైదరాబాద్
ఉపాధ్యాయ విద్యను సమూలంగా మార్చేందుకు నూతన విద్యావిధానం ముసాయిదా నివేదికలో పలు సంస్కరణలను పేర్కొన్నారు.
ఉపాధ్యాయవిద్య పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన కళాశాలల్ని మూసివేయాలని నూతన విద్యావిధానంపై ఏర్పాటైన కమిటీ అభిప్రాయపడింది. 2030 నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ కోర్సులను డిగ్రీ, పీజీ కోర్సులు నిర్వహించే కళాశాలల్లోనే బోధించాలని పేర్కొంది. ఉపాధ్యాయ వృత్తిలోకి అత్యంత ప్రతిభావంతులైన వారికే ప్రవేశం కలిగేలా చర్యలు తీసుకోనుంది. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు భారీస్థాయిలో ఉపకారవేతనాలు అందించనుంది.
మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా అల్పాహారాన్ని అందించాలని నివేదిక అభిప్రాయపడింది. వైద్యవిద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (నీట్)ను నిర్వహిస్తున్నట్లు..
ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసిన తరువాత కూడా ‘ఎగ్జిట్ పరీక్ష’ను నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా ఈ అంశాలను పేర్కొంది.
సమూల మార్పులు..
విదేశాల్లో ఉపాధ్యాయ విద్యలో ప్రవేశించే అవకాశం అత్యంత ప్రతిభావంతులకే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ విద్యను సమూలంగా మార్చాలని కమిటీ అభిప్రాయపడింది.
ఉపాధ్యాయ వృత్తి కోర్సు చేయాలంటే ఇక నుంచి తప్పనిసరి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు చేయాలి. రెండేళ్ల బీఈడీ కోర్సును ఏడాది కోర్సుగా మార్చి, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కేవలం రాతపరీక్ష మార్కులకే ప్రాధాన్యముంది. టెట్లో ప్రతి అభ్యర్థి 5 నుంచి ఏడు నిమిషాల ప్రత్యక్ష తరగతుల డెమోకు హాజరు కావాలని ప్రతిపాదన చేర్చింది.
హిందీకి జైకొడదాం..
పాఠశాల విద్యలో హిందీకి అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆరోతరగతి నుంచి పిల్లలు మూడు భాషలు నేర్చుకోవాల్సిందే. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీతో పాటు మాతృభాషను, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇతర భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. బోధనలో మాతృభాష, జాతీయ భాష హిందీకి ప్రాధాన్యత ఇస్తూ.. ఇంగ్లిష్ భాషకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇక ‘ప్రైవేటు పాఠశాల’ అనే పదాన్ని ఉపయోగించకూడదు.
‘ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయం పొందుతున్నవి’ అని మాత్రమే వ్యవహరించాలి.
పబ్లిక్.. ప్రైవేటు యూనివర్సిటీలే..
దేశంలో భవిష్యత్తులో స్వయంప్రతిపత్తి, గుర్తింపు పొందిన, అనుబంధ యూనివర్సిటీలు అనేవి ఉండవు.
యూనివర్సిటీలంటే కేవలం పబ్లిక్, ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్ మాత్రమే. విశ్వవిద్యాలయాలు ఎంఫిల్ కోర్సులు ఎత్తివేయాలి. పీహెచ్డీ చేయాలంటే నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉన్నవారికే అవకాశమివ్వాలి. కేంద్రం రూ.20 వేల కోట్లతో జాతీయ పరిశోధన ఫౌండేషన్ (ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటు చేస్తుంది.
ఈ నిధిని పరిశోధనల కోసం ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు వినియోగించుకునేందుకు కేంద్రం అవకాశం ఇస్తుంది
0 Response to "ఉపాధ్యాయ విద్యలో సమూల మార్పులు"
Post a Comment