చదువుల ప్రక్షాళన

చదువుల ప్రక్షాళన

‘విద్యా ప్రణాళికలకు ఏవో కొద్దిపాటి మార్పులు సూచించడం కాదు; దేశీయంగా పరిస్థితులు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థను పునాదుల స్థాయినుంచి ప్రక్షాళన చెయ్యాలి’- ఏనాడో 1948నాటి అఖిల భారత విద్యా సదస్సులో తొలి ప్రధాని పండిత్‌ నెహ్రూ మార్గ నిర్దేశమది. ఏడు  దశాబ్దాలుగా ఆ మంచి మాటకు మన్నన కొరవడి ‘ప్రాథమికం’నుంచి ‘స్నాతకోత్తరం’దాకా భారత విద్యావ్యవస్థ పెను సంక్షోభాల ఊబిలో దిగబడిపోయింది. అంతర్జాతీయ ఉత్కృష్ట విద్యా ప్రమాణాల్ని సాధించడానికి ఇండియా మరో ఆరు తరాల పాటు చెమటోడ్చాల్సిందేనన్న అసోచామ్‌ (భారత వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య) నివేదిక నిస్పృహ రగిలిస్తున్నా- వడివడిగా సాగాల్సిన సమూల క్షాళనకు మార్గదర్శిగా జాతీయ విద్యావిధాన ముసాయిదాను కస్తూరి రంగన్‌ సారథ్యంలోని కమిటీ కేంద్రానికి అందించింది. మోదీ సర్కారు మలి దఫా పాలన మొదటి రోజే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చేతికందిన నివేదిక- ఉన్నత ప్రమాణాల విద్యను అందరికీ అందించడం ద్వారా గతిశీల విజ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణాన్ని లక్షిస్తోంది. 


కేంద్ర క్యాబినెట్‌ మాజీ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ 2016 మే నెలలో సమర్పించిన నివేదికను, కేంద్రం అందించిన మరికొంత సమాచారాన్ని వడబోసి కస్తూరి రంగన్‌ కమిటీ ప్రతిపాదించిన 19 మార్పులు- దేశీయ విద్యా వ్యవస్థ రూపు రేఖా విలాసాల్ని గణనీయంగా ప్రభావితం చేసేవే. 2030నాటికి విద్యారంగంపై వ్యయం 20శాతానికి చేరేలా క్రమంగా పెట్టుబడుల్ని పెంచుకొంటూ పోవాలన్న కమిటీ కీలక సూచన- విద్యారంగ సముద్ధరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధికి తార్కాణంగా నిలిచేదే! నేలబారు ప్రమాణాలతో నెట్టుకొస్తున్న బోధన కళాశాలలకు టోకున చాపచుట్టి, ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలన్నింటినీ విశ్వవిద్యాలయాలకు బదలాయించాలన్న కస్తూరి రంగన్‌ కమిటీ ప్రతిపాదన- అవ్యవస్థ క్షాళనలో కీలకమైన తొలిమెట్టు. కాలం చెల్లిన చదువులు, స్ఫూర్తి రహిత గురువులు, నేతిబీర చందంగా ప్రమాణాలు, పరీక్షల ఒత్తిళ్లు, కొరగాని పట్టాలు- వీటినుంచి భావితరానికి విముక్తి కలిగించే క్రమంలో మరే మాత్రం ముందు వెనకలాడరాదు!



దేశ స్వాతంత్య్రానికి పదేళ్ల ముందే వార్ధా వేదికగా జరిగిన జాతీయ విద్యా సదస్సులో కొత్త అభ్యసన (నయీ తాలిమ్‌) విధానాన్ని ప్రతిపాదించారు మహాత్మాగాంధీ. 


వృత్తిపరమైన ఒడుపులను నేర్పే చదువుల ఆవశ్యకతను నయీతాలిమ్‌ ప్రబోధించింది. దానికి మన్నన దక్కలేదు సరికదా- దాదాపు రెండున్నర కోట్లమంది బాలలు అజ్ఞానంలో కొట్టుమిట్టాడే దురవస్థకు దోహదపడుతున్నారంటూ బ్రిటిష్‌ పాలకులపై కాలుదువ్విన దాదాభాయ్‌ నౌరోజీ ఆత్మ మరింత క్షోభిల్లేలా విద్యా వ్యవస్థను దేశీయ పాలకులు నీరుగార్చారు! ప్రాథమిక స్థాయిలో చదువులు ఎంతగా చట్టుబండలైందీ ఏటా ‘అసర్‌’ నివేదికలు కళ్లకు కడుతుంటే, ఎంత ఉన్నత విద్యకు అంత నిరుద్యోగిత చందంగా వ్యవస్థ ఆసాంతం పుచ్చిపోయింది. 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లమందికిపైగా యువజనం ఉద్యోగార్హ నైపుణ్యాలు లేక నిస్పృహలో కూరుకుపోతారని, అందులో మెజారిటీ వాటా భారతీయులదేనని అధ్యయనాలు భవిష్యద్దర్శనం చేస్తున్నాయి. అక్షరాలా కోమాలో ఉన్న దేశీయ విద్యారంగాన్ని తిరిగి గాడిన పెట్టాలంటే గరళ వైద్యం తప్పనిసరి. 1986నుంచి అమలులో ఉండి 1992లో పునస్సమీక్షకు నోచుకొన్న ప్రస్తుత విద్యా విధానాన్ని కస్తూరి రంగన్‌ కమిటీ ఏకమొత్తంగా తోసిపుచ్చుతోంది. 



తెలుసుకోవాలన్న జిజ్ఞాస పుట్టినప్పటినుంచే ప్రతి బిడ్డకూ ఉంటుందంటూ- మూడో ఏటనుంచి అయిదేళ్ల పాటు పునాది స్థాయి చదువును పరిపుష్టం చెయ్యాల్సిన అవసరాన్ని కమిటీ ప్రబోధించింది. ప్రస్తుతం ఉన్న 10+2+3 విద్యా వ్యవస్థను 5+3+3+4 సంవత్సరాలుగా రూపాంతరీకరించి, విద్యాహక్కు చట్టం పరిధినీ విస్తరించి, దేశ భావి అవసరాలకు దీటైన మెరికల్ని సృష్టించే విధాన ముసాయిదా ఇప్పటికి సిద్ధమైంది. 



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిలోగా ఏమేమి చెయ్యాలో విపుల కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దిద్దుబాట్లు సత్వరం పట్టాలకెక్కాలి!

భావి భారత భాగ్య విధాతలుగా రేపటి పౌరులు రాణించేలా వారిలోని సహజ సిద్ధ ప్రతిభా పాటవాలకు సానపట్టే మహా క్రతువు ప్రాథమిక పాఠశాలల్లోనే నిష్ఠగా జరగాలి. ఈ విషయంలో అమెరికాలాంటి దిగ్గజ దేశాల్ని వెనక్కి నెట్టి, ఏ మాత్రం ఒత్తిడి లేని చదువులతో నిజ జీవితానికి అన్వయించుకోగల పరిజ్ఞానాన్ని చిన్నారుల్లో పెంపొందించేలా ఫిన్లాండ్‌ ఇస్తున్న ఉపాధ్యాయ శిక్షణ సంస్తుతి పాత్రమైనది. ‘దేశ భవిష్యత్తు తయారయ్యేది తరగతి గదుల్లోనే’ అన్న స్పృహ కలిగిన దేశాలన్నీ కాలంతో పోటీపడి మరీ విద్యారంగ సంస్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి.


 అందుకు పూర్తి భిన్నంగా సరైన శిక్షణ కొరవడిన 11 లక్షలమంది గురువుల బోధనతో దేశీయంగా ప్రమాణాలు గుల్లబారుతున్నాయి. మూడేళ్ల ముందస్తు బడినుంచి పన్నెండో తరగతి దాకా ఉచిత నిర్బంధ విద్య అందించాల్సిందేనంటున్న కమిటీ- నిపుణ టీచర్ల కొరత అధిగమించడానికి సామాజిక బాధ్యతగా చదువుకున్నవారు కదిలిరావాలంటోంది! పరిమిత వనరుల్ని పాఠశాలలు పరస్పర ప్రయోజనదాయకంగా పంచుకొని వినియోగించుకొనే కొత్త సంస్కృతి పాదుకొనాలని కమిటీ అభిలషిస్తోంది. కేవలం దాని ద్వారానే కొరతల కోమానుంచి బడులు బయటపడతాయా అన్నది చూడాలి! 2030నాటికి ‘మిషన్‌ నలందా’ ద్వారా పరిశోధనల్లో తలమునకలయ్యే విశ్వవిద్యాలయాలు వంద, ఉన్నత ప్రమాణాలతో అలరారేవి అయిదు వందలు ఉండాలన్న లక్ష్యం వీనుల విందుగానే ఉన్నా- అది సాధ్యమా అన్న సందేహం పీడిస్తోంది. వ్యర్థ వివాదాలతో పొద్దుపుచ్చడం అక్షరాలా జాతి ద్రోహమేనన్న తెలివిడితో, విద్యారంగ సమూల క్షాళనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం సంసిద్ధం కావాలి

-eenadu editorial

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చదువుల ప్రక్షాళన"

Post a Comment