మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు దాదాపు ఒకే  తేదీలలో జరగనున్నడంతో.. టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయాలని ప్రాథమిక విద్యా శాఖ యోచిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి మే 12వరకు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాలకు ఇబ్బంది లేకుండా రెండు పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే సూచించారు. అయినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ప్రాథమిక విద్యా శాఖ ఉంది. దీంతో పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మే 2నుంచి కాకుండా రెండు వారాల తర్వాత.. అంటే ఇంటర్‌ పరీక్షలు అయిన తర్వాత పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించిన తర్వాత నాలుగైదు రోజుల్లో  ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

ఆలస్యంగా ఒంటిపూట బడులు 


ఏటా మార్చి 15నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నాయి. పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఒంటిపూట బడులను ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ నుంచి ఒంటిపూట బడులు పెడతారని సమాచారం. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " "

Post a Comment