ఉద్యోగుల మెడపై మరో కత్తి! ఫిబ్రవరి జీతంపై ‘సస్పెన్స్‌’




5 రోజుల్లో 4,96,675 బిల్లుల పరిశీలన 

సరిచూసి సస్పెన్స్‌ ఖాతాకు పంపండి

ఆలోగా వచ్చిన బిల్లుల వరకే జీతాలు 

సప్లిమెంటరీ బిల్లులకు నో చాన్స్‌ 

డీడీవోలకు రావత్‌ తాజా ఆదేశాలు 

జనవరిలో సస్పెన్స్‌ ఖాతా నుంచే జీతాలు

ఆ తప్పునకు ఇప్పుడు ఉద్యోగులు బలి

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు అందుతాయో లేదోనన్న ‘సస్పెన్స్‌’ నెలకొంది. ఇందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విధించిన నిబంధనలు వివాదాస్పదంగా మారాయి. వాటిప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,96,675 మంది ఉద్యోగులకు సంబంధించిన పేస్లిప్పులను 44వేల మంది డీడీవోలు కేవలం ఐదు రోజుల్లో పరిశీలించాల్సి ఉంది. వాటిలో తప్పొప్పులను సవరించి, రికవరీలు లెక్కచూసి కొత్త పేస్లిప్పులు సిద్ధం చేసి ఆ మొత్తాలను సస్పెన్స్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. అప్పుడే ఫిబ్రవరి జీతాలు అందుతాయి. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 21 నుంచి 25లోపు పూర్తి చేయాలి. లేకపోతే మార్చిలో సప్లిమెంటరీ బిల్లులు పెట్టే అవకాశం కూడా ఉండదని డీడీవోలకు రావత్‌ ఆదివారం ఇచ్చిన మెమోలో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల పాత వేతనాల్లో ఐఆర్‌, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ రికవరీలు విధించి కొత్తగా లెక్కించాలి. వీటన్నింటికీ దాదాపు నెల పడుతుందని, అలాంటిది 5 రోజుల్లో చేయడం ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా 25వ తేదీలోపు బిల్లు పెట్టడం కుదరకపోతే తర్వాతి నెలలో 5వ తేదీ నుంచి సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవచ్చు. కానీ, ఈ నెలలో రావత్‌ ఆ నిబంధన ఎత్తేశారు. అంటే ఐదు రోజుల్లో డీడీవోలు 4,96,675 వేతనాల బిల్లుల్లో ఎన్నింటిని సరిచేసి సస్పెన్స్‌ ఖాతాకు పంపించగలిగితే అంతమందికే మార్చిలో జీతాలు అందుతాయి. ప్రభుత్వం మళ్లీ సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తేనే మిగిలిన వారికి వేతనాలు అందుతాయి. ఈ ఆదేశాల ప్రకారం డెడ్‌లైన్‌లోగా అంటే 25లోగా బిల్లులు పెట్టకపోతే ఆ వేతనాలు ఎప్పుడు అందుతాయో, ఇందుకు ఎంత సమయం పడుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులో తమకు కావాల్సిన బిల్లుల చెల్లింపులు చేసుకునేందుకే తమ వేతనాల్లో మెలిక పెట్టిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

సస్పెన్స్‌ ఖాతా నుంచి జీతాలు 

రివర్స్‌ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యోగులంతా జనవరిలో ఉద్యమం చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పెట్టబోమంటూ ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు సహాయ నిరాకరణ చేశారు. దీంతో డీడీవోలకు ఉండే వేతనాల బిల్లుల అధికారాలను డీటీఏ, పీఏవోలకు దఖలుపరుస్తూ జీవో ఇచ్చారు. సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా టీసీఎస్‌ సాయంతో ఒక ఫార్ములా ప్రకా రం పేస్లిప్పులు సిద్ధంచేసి రెగ్యులర్‌గా ఇచ్చే జీతాల హెడ్‌ నుంచి కాకుండా కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడే సస్పెన్స్‌ ఖాతా నుంచి జీతాలిచ్చారు. కానీ, ఏ ఉద్యోగికీ సరైన వేతనం పడలేదు. జనవరి నెలకు సంబంధించి ఉద్యోగులందరికీ ఇంకా పేస్లిప్పులు అందనేలేదు. ఇప్పుడు డీడీవోలు వాటిని సరిచేసి 5 రోజుల్లోగా కొత్తవి రూపొందించాల్సి ఉంది. వాస్తవానికి సస్పెన్స్‌ ఖాతాను వాడొద్దంటూ రాష్ట్రాల ఆర్థిక శాఖలను కాగ్‌ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏదైనా రాష్ట్రం సస్పెన్స్‌ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించడమంటే నిబంధనలు ఉల్లంఘించినట్టే. సస్పెన్స్‌ ఖాతా వాడిన ప్రతిసారీ కాగ్‌ వివరణ అడుగుతుంది. ఈసారి కూడా ప్రభుత్వాన్ని కాగ్‌ వివరణ కోరే అవకాశాలున్నాయి. జీతాల కోసం సస్సెన్స్‌ ఖాతా వాడటం వల్ల ఆ ఖాతాలో నిధులు మైన్‌సల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ లోటును పూడ్చటానికే డీడీవోలంతా సరిచేసిన వేతనాల మొత్తాన్ని సస్పెన్స్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఆదేశాలిచ్చారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగుల మెడపై మరో కత్తి! ఫిబ్రవరి జీతంపై ‘సస్పెన్స్‌’"

Post a Comment