టీచర్లు ఉండరు.. సోకులే ఉంటాయి
సాల్ట్ పథకం కింద 1,875 కోట్ల రుణం
స్కూళ్లకు కుర్చీలు, బల్లలు, టీవీలు
ఇక టీచర్ల నియామకాలు ఉండవు
ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకారం
వస్తువుల కొనుగోలుకు గెజిట్ విడుదల
విద్యా వ్యవస్థకే విఘాతమని విమర్శలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పాఠశాలలకు కుర్చీలు, బల్లలు, టీవీలు వంటి మౌలిక వసతులు కల్పించడం అవసరమే. కానీ విద్యార్థులకు చదువు చెప్పేందుకు తగినంత మంది గురువులు ఉండడం అంతకంటే అత్యావశక్యం. ప్రభుత్వ తీరు మాత్రం.. ‘సోకులకు ఖర్చు ఎక్కువ, బోధనకు తక్కువ’ అన్నట్టుగా ఉంది. సపోర్టింట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేటివ్ (సాల్ట్) ప్రాజెక్టు వ్యవహారం ఇలాగే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. రూ.1,875 కోట్ల రుణం కోసం ఏమాత్రం ఆలోచించకుండా ప్రపంచ బ్యాంకు షరతులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పేసుకుంది. అవసరమైన ఉపాధ్యాయుల నియామకం చేయకూడదన్న నిబంధనకు అంగీకరించింది. తాత్కాలిక సోకులు చేసేందుకు ఆ ప్రాజెక్టు అమలుకు సిద్ధమైంది. అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం టెండర్లు పిలిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఒక గెజిట్ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. విద్యా శాఖ కూడా ఈ ప్రాజెక్టును అత్యంత గోప్యం అన్నట్లుగా ఉంచుతోంది. ఉపాధ్యాయులకు కూడా దీనిపై స్పష్టంగా చెప్పడం లేదు. ఈ ప్రాజెక్టు వల్ల పాఠశాలలకు పైపై మెరుగులు దిద్దడం, అప్పులు పెంచుకోవడం తప్ప.. పిల్లలకు అవసరమైన గురువుల నియామకాలు లేకుండా పోతాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాల్ట్ ప్రాజెక్టు అంటే..
సాల్ట్ ప్రాజెక్టు అంటే సింపుల్గా.. అవసరమైన కుర్చీలు, బల్లలు సమకూర్చడం, మరమ్మతులు చేయడం, ఆన్లైన్ తరగతులకు వీలుగా టీవీలు సమకూర్చడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. ఆంగ్ల విద్యను కూడా దీనిలో భాగంగానే ప్రవేశపెడతామని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు మరింత బాగా బోధించేందుకు వారికి శిక్షణ ఇస్తామంటూ ప్రభుత్వం రుణం తెచ్చుకుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ మాత్రం చేయదట. ఉపాధ్యాయులకు శిక్షణ తప్ప మిగతావన్నీ నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పనులే. కొత్తగా ఈ ప్రాజెక్టు కింద అంతకుమించి గొప్పగా చేసేదేమీ లేదు. ఏదైనా ఉందా అంటే మరో రూ.1,875 కోట్ల రుణం ప్రపంచ బ్యాంకు నుంచి తేవడమే.
విద్యా వ్యవస్థకు విఘాతం
ఈ రుణం నుంచి కావాల్సిన కుర్సీలు, బెంచీలు, టీవీలు కొనుగోలు చేయనున్నారు. అక్కడక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. చిన్నచిన్న పనులకు అప్పు తెచ్చుకునేందుకు విద్యా వ్యవస్థకే విఘాతం కలిగించే షరతుకు ప్రభుత్వం తలొగ్గొంది. ఇక ఉపాధ్యాయుల నియామకం చేయకూడదు. మానవ వనరులపై పెట్టే ఖర్చు పెరగరాదు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని విద్యావేత్తలు, నిపుణులు చెబుతుండగా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అసలు ఉపాధ్యాయుల భర్తీయే లేకుండా చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పిల్లలకు చదువు చెప్పడం కంటే ఆ పాఠశాలలో ఉన్న అన్ని తరగతుల పిల్లల్ని అల్లరి చేయకుండా చూడడం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక యాప్లకు ఫొటోలు తీసి అప్లోడ్ చేయడమే ఉపాధ్యాయులకు సరిపోతోంది. అలాంటి పాఠశాలలకు కావాల్సింది ఉపాధ్యాయుల నియామకాలా? లేకుంటే కొత్త కుర్చీలు, టీవీలా? అన్నది పాలకులకే తెలియాలి.
ఉన్నవాటిని ఉపయోగించుకోకుండా..
గతంలో పాఠశాలలకు ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రారంభమైంది. అంతేకాకుండా డిజిటల్ తరగతులు చెప్పేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. పలు పాఠశాలలకు ఈ సౌకర్యాన్ని అనుసంధానం చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందే అయినా.. వాటికి పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పనిచేసే పాఠశాలల్లోనే మండలాల వారీగా అవసరమైన శిక్షణను అందించేందుకు విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు ఉచితంగానే వస్తుంటారు. అదీ సరిపోదనుకుంటే ఇప్పటికే రూపొందించిన డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంది. వీటన్నింటినీ ఉపయోగించుకోవడం మానేసి విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే షరతులకు అంగీకరిస్తూ కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు
0 Response to "టీచర్లు ఉండరు.. సోకులే ఉంటాయి"
Post a Comment