కరోనాతో ఏడాదిన్నరగా దెబ్బతిన్న చదువులుSep
- గ్రామీణ విద్యార్థులపై అధికంగా ప్రభావం
- ప్రముఖ ఆర్థిక వేత్తల సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: దాదాపు ఏడాదిన్నరగా స్కూళ్లు లేకపోవడంతో చిన్నచిన్న పదాలు చదవడానికే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదవర్గాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుల విషయంలో తీవ్రంగా నష్టపోయారు. కరోనా నేపథ్యంలో పిల్లల చదువులపై ప్రముఖ ఆర్థిక వేత్తలు జీన్ ద్రీజ్, రీతికా ఖేరా ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. దీనికోసం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను సర్వే చేశారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి ఇప్పటివరకు తాము అసలు చదువుకోలేదని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 37 శాతం మంది విద్యార్థులు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 19 శాతం విద్యార్థులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో 28శాతం, పట్టణ ప్రాంతాల్లో 47శాతం మంది మాత్రం కరోనా ఉన్నప్పటికీ తమ చదువులు ఎప్పటిలాగే కొనసాగినట్టు తెలిపారు. పరిస్థితులను బట్టి తాము అప్పుడప్పుడు చదువుకోగలిగామని మిగతా విద్యార్థులు చెప్పారు. సర్వేలో భాగంగా విద్యార్థులకు రీడింగ్ టెస్ట్ నిర్వహించారు. దాదాపు సగం మంది విద్యార్థులు కొన్ని పదాలకు మించి చదవలేపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో 51శాతం ఇళ్లలో మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నట్టు సర్వే వెల్లడించింది. అందువల్ల 8శాతం గ్రామీణ విద్యార్థులు మాత్రమే క్రమం తప్పకుండా ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యారు.
పట్టణ ప్రాంతాల్లో 77శాతం ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉండటం వల్ల 24శాతం వరకు విద్యార్థులు క్లాసులకు హాజరుకాగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సొంత ఫోన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు ఏమీ నేర్చుకోలేదని అధిక శాతం తల్లిదండ్రులు చెప్పారు. పట్టణాల్లో 65శాతం, గ్రామాల్లో 70శాతం పేరెంట్స్ అసంతృప్తితో ఉన్నారు. దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన పిల్లల్లో 4శాతం మాత్రమే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు
0 Response to "కరోనాతో ఏడాదిన్నరగా దెబ్బతిన్న చదువులుSep"
Post a Comment