బడులు తెరవడంపై రాష్ట్రాలదే నిర్ణయంSep


  • ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు.. వివిధ రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు
  • కొవిడ్‌ ముప్పు దృష్ట్యా బెంచి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: కొవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరవాలన్న విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర  ప్రభుత్వాలే పూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది.


‘‘పిల్లలకు కొవిడ్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాలి. ఇలాంటి విషయాలలో ఆదేశాలిచ్చేటప్పుడు  కోర్టులు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వాలు కాలపరిమితిలోగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ పన్నెండో తరగతి విద్యార్థి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ‘కొవిడ్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలలో భిన్న పరిస్థితులు ఉన్నాయి.  విస్తీర్ణం, జనసాంద్రతను బట్టి అక్కడ పరిస్థితులు  ఉంటాయి’ అని ధర్మాసనం పేర్కొంది.  ఇలాంటి వ్యాజ్యాలు పిల్లలచేత వేయించరాదని విద్యార్థి తరఫు న్యాయవాదికి సూచించింది. 



గర్భిణిలు, బాలింతలకు టీకాలపై వ్యాజ్యం విచారిస్తాం: సుప్రీం

గర్భిణులు, బాలింతలకు కొవిడ్‌ సోకే ముప్పు ఎక్కువ ఉన్నందున టీకాలలో వారికి ప్రాధాన్యమివ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానమివ్వాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులిచ్చింది. ఢిల్లీలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది.


ఇదిలావుండగా, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి టీకాలిచ్చే విషయమై రెండు వారాల్లోగా సమాధానమివ్వాల్సిందిగా మరో కేసులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ధర్మాసనం కేంద్రానికి సోమవారం నోటీసులిచ్చింది. దివ్యాంగులకు టీకాల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను వివరించాల్సిందిగా ధర్మాసనం ఎస్జీ తుషార్‌ మెహతాను కోరింది. ఒక ఎన్జీవో ఈ వ్యాజ్యం వేసింది. 


కరోనా.. రూపు మారే కొద్దీ ముప్పు తీవ్రం!

చైనాలో పుట్టిన అసలు కరోనా వైరస్‌ కంటే.. రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు గాలిద్వారా మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయని మేరీల్యాండ్‌ వర్సిటీ (అమెరికా) శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. వూహాన్‌లో మొదలైన సార్స్‌-కొవ్‌-2 (కరోనా ఒరిజినల్‌ స్ట్రెయిన్‌)తో పోలిస్తే.. అల్ఫా వేరియంట్‌ బారిన పడినవారి శ్వాస ద్వారా 43 నుంచి 100 రెట్లు ఎక్కువ వైరస్‌ గాల్లోకి వ్యాపించి, ఇతరులకు సోకుతోంది. ఇక, అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా మరింత వేగంగా గాలిద్వారా వ్యాపిస్తున్నట్టు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ మిల్టన్‌ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బడులు తెరవడంపై రాష్ట్రాలదే నిర్ణయంSep"

Post a Comment