నిధుల సమీకరణే కొత్త సీఎస్‌కు పెద్ద సవాల్‌ వీడ్కోలు కార్యక్రమంలో ఆదిత్యనాథ్‌దాస్‌ వ్యాఖ్య కొత్త సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతల స్వీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి ఆర్థిక వనరుల సమీకరణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ముందున్న పెద్ద సవాల్‌ అని... సీఎస్‌గా గురువారం పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీ విరమణ చేయడం లేదని, 





దిల్లీకి మారుతున్నారు అంతేనని.. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అక్కడి నుంచి రాష్ట్రానికి మరింతగా సేవలందిస్తారని సమీర్‌శర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌శర్మ గురువారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సీఎస్‌ కార్యాలయంలో ఆదిత్యనాథ్‌దాస్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా నవరత్నాలు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు... ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు

ఆదిత్యనాథ్‌కు ఘనంగా వీడ్కోలు: కొత్త సీఎస్‌ బాధ్యతల స్వీకారానికి ముందు మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఆదిత్యనాథ్‌దాస్‌కు వీడ్కోలు, సమీర్‌శర్మకు స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఆదిత్యనాథ్‌దాస్‌ మాట్లాడుతూ తన తొలి ఇన్నింగ్స్‌ ముగిసిందని, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నానని చెప్పారు. ‘అధికారులు, సిబ్బంది బృందంగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశాం. నేను దిల్లీకి ప్రభుత్వ సలహాదారుగా వెళుతున్నా’ అని పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌దాస్‌ మంచి వ్యక్తిత్వమున్న అధికారి అని, తనకు కుటుంబ స్నేహితుడని సమీర్‌ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌, పూనం మాలకొండయ్య, శశిభూషణ్‌కుమార్‌, సునీత, ఎస్‌.ఎస్‌.రావత్‌, వి.ఉషారాణి, జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిధుల సమీకరణే కొత్త సీఎస్‌కు పెద్ద సవాల్‌ వీడ్కోలు కార్యక్రమంలో ఆదిత్యనాథ్‌దాస్‌ వ్యాఖ్య కొత్త సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతల స్వీకరణ"

Post a Comment