మంచి ఉపాధ్యాయుడే జాతి నిర్మాత
- పిల్లల్లో ప్రతిభను వెలికితీసే బాధ్యత
- టీచర్లదే: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
- 44 మందికి ‘జాతీయ ఉత్తమ
- ఉపాధ్యాయ’ అవార్డుల అందజేత
- విజ్ఞానం, నవకల్పనల కేంద్రంగా
- భారత్: ఉప రాష్ట్రపతి వెంకయ్య
- టీచర్ల సేవలు ప్రశంసనీయం: మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: బోధనలో వినూత్న పద్ధతులను అభివృద్ధి చేస్తున్న, విద్యార్థుల వికాసానికి కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పురస్కారాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 44 మందికి ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల’ అవార్డులు అందజేశారు. పాఠశాల విద్య నాణ్యతను పెంచడమేగాక విద్యార్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న ఆయా టీచర్లకు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి పురస్కారాలను అందించారు. ప్రతి విద్యార్థికీ విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ ఉంటాయన్న కోవింద్.. ఉపాధ్యాయులు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. వారి అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాలని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉండే ప్రతిభను వెలికి తీసే ప్రాథమిక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఓ మంచి ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ నిర్మాత, సమాజ నిర్మాత, జాతి నిర్మాత అని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించి పురస్కారాలు సాధించిన 44 మంది ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల భవిష్యత్ తరాలు భద్రంగా ఉంటాయన్న తన నమ్మకం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంగా విద్యా సంస్థలు తెరుచుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లోనూ టీచర్లు కష్టపడుతున్నారని రాష్ట్రపతి తెలిపారు. అతి తక్కువ కాలంలోనే డిజిటల్ వేదికల వినియోగాన్ని నేర్చుకొని, విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారని కొనియాడారు. కొందరు టీచర్లు కష్టపడి అద్భుతమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకున్నారన్నారు. విజ్ఞానంలో భారత్ను అంతర్జాతీయ సూపర్ పవర్గా నిలపాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం గత ఏడాది జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని రాష్ట్రపతి చెప్పారు. విద్యార్థులకు ఆ మేరకు అత్యుత్తమ విద్యను అందించాలన్నారు. భారత్ మరోసారి విశ్వ గురువుగా అవతరించే సమయం ఆసన్నమైందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. మన దేశం విజ్ఞానం, నవకల్పనల కేంద్రంగా మారనుందని ఆదివారం ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా చేసిన ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ విద్యార్థుల చదువులు ఆగిపోకుండా వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్న టీచర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. కాగా, వరదలను కూడా లెక్క చేయకుండా పడవలో పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థినిని కాంగ్రెస్ నేతత రాహుల్ గాంధీ ప్రశంసించారు. యూపీలోని గోరఖ్పూర్ జిల్లాకు చెందిన సంధ్య వరదల్లో తన ఇల్లు ముగినిపోయినా.. స్వయంగా పడవ నడుపుకుంటూ పాఠశాలకు చేరుకుందని, ఆమె ధైర్యం మనకెంతో నేర్పుతోందని ‘టీచర్స్ డే’ హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేశారు
0 Response to "మంచి ఉపాధ్యాయుడే జాతి నిర్మాత"
Post a Comment