పాఠశాలల్లో కొవిడ్‌ కలకలం



ప్రకాశం జిల్లాలోని 2 స్కూళ్లలో పాజిటివ్‌లు 

ఒక హెడ్‌మాస్టర్‌, ఐదుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు  

టెస్టులు మొదలైతే కేసులు పెరుగుతాయన్న భయం


అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో కొవిడ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. బడులు ప్రారంభమైన వారం రోజుల తర్వాత ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. అయితే స్కూళ్లు తెరిచి ఇంకా వారం కానేలేదు. కరోనా పరీక్షలూ నిర్వహించలేదు. కానీ ఈలోపే అనుమానంగా ఉన్న కొందరు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో శనివారం ఒక హెడ్‌మాస్టర్‌, ఇద్దరు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కొవిడ్‌ సోకింది. ఇదే జిల్లా మైనంపాడు మండలంలోని పాఠశాలలో రెండురోజుల క్రితం ఇద్దరు టీచర్లతో పాటు అక్కడి క్యాంప్‌సలో ఉన్న డైట్‌ కళాశాలలో ఒక ఉపాధ్యాయురాలు కొవిడ్‌ బారిన పడ్డారు. పాఠశాలలు ప్రారంభమైన ఐదు రోజుల్లోనే కేసులు వస్తుండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడులు ప్రారంభమయ్యాక ప్రతి వారం, ప్రతి తరగతికి చెందిన కొందరు విద్యార్థులు, కొందరు ఉపాధ్యాయులకు ర్యాండమ్‌గా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముందుగానే సూచించింది. అయితే పరీక్షలు ప్రారంభం కాకముందే కొందరు వైరస్‌ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

పరీక్షలు నిర్వహించడం మొదలైతే కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, వచ్చేవారం అన్ని పాఠశాలల్లోనూ ర్యాండమ్‌గా పరీక్షలు చేస్తారు. ఉపాధ్యాయులు, పిల్లలు దగ్గరిలో ఉన్న కేంద్రానికి వెళ్లి ఈ పరీక్ష చేయించుకోవాలని అధికారులు నిర్దేశించారు. ఒక తరగతిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, వారిలో ఎవరికైనా పాజిటివ్‌గా వస్తే తరగతిలో మిగిలిన వారందరికీ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు కొవిడ్‌ సోకినా ఇదే పద్ధతి అనుసరించాలన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల్లో కొవిడ్‌ కలకలం"

Post a Comment