15 తర్వాత బడులు తెరుద్దాం! పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితిపై నివేదిక ఇంకా నిర్ణయం తీసుకోని సర్కారు

ఈనాడు, హైదరాబాద్‌: ‘దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నాయి.. కొన్ని ఇప్పటికే మొదలుపెట్టగా, మరికొన్ని ఎప్పటి నుంచి తెరవాలో నిర్ణయం తీసుకున్నాయి.. 



మనం కూడా ఓ నిర్ణయానికి రావాలి’ అని పాఠశాల విద్యాశాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఏ రాష్ట్రాల ప్రణాళిక ఎలా ఉందో అక్కడి విద్యా పరిశోధన, శిక్షణ మండళ్ల(ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులను, విద్యాశాఖ కార్యదర్శులను సంప్రదించి వివరాలను తెలుసుకొని అది సమగ్ర నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఈనెల 1న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగగా అంతకు ముందు రోజు ఈ నివేదికను సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలోనూ ఆగస్టు 15 తర్వాత దశలవారీగా ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని నివేదికలో పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. ‘ఈ అంశంపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని భావించాం.. అలా జరగలేదు’ అని విద్యాశాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి.

ఇతర రాష్ట్రాల్లో తెరిస్తే ఇక్కడా తప్పదా?

రోజు విడిచి రోజు తగిన జాగ్రత్తలతో బడులు తెరవాలని తాజాగా విద్యపై పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు పలు రాష్ట్రాలు ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, ఇక్కడా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కంటే ఎక్కువ కేసులు ఉన్న చోట్లే బడులను తెరిస్తే ఇక్కడ ఏ కారణం వల్ల తెరవడం లేదన్న ప్రశ్న తలెత్తుతుందని వారు చెబుతున్నారు


 ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నారు.

తమిళనాడులో సెప్టెంబరు 1 నుంచి 9-12 తరగతులను 50 శాతం విద్యార్థులతో ప్రత్యక్ష తరగతులు మొదలుపెడతామని ప్రభుత్వం ప్రకటించింది.

కర్ణాటకలో 9-12 తరగతులకు  ఈనెల 23 నుంచి ఆఫ్‌లైన్‌ తరగతులు మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు.

యూపీలో ఈనెల 16 నుంచి 50 శాతం సామర్థ్యంతో ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది


 ఒడిశాలో జులై 26 నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు.

మహారాష్ట్రలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈనెల 17 నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టాలని  సర్కారు నిర్ణయించింది.

దిల్లీలో బడుల ప్రారంభంపై నిపుణుల కమిటీని నియమించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "15 తర్వాత బడులు తెరుద్దాం! పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితిపై నివేదిక ఇంకా నిర్ణయం తీసుకోని సర్కారు"

Post a Comment