మొక్కు..బడే
తొలిరోజు హాజరు అంతంతే
42శాతంగా ప్రకటించిన సర్కారు
కొవిడ్ భయంతో పలచగా పిల్లలు.. క్లాసుకు 16మందికే అనుమతి
కర్నూలులో ఎండలో పాఠాలు.. కృష్ణాలో 50 మంది టీచర్లకు కరోనా
విద్యార్థులపై ఒత్తిడి వద్దు.. చదువులు ఆనందంగా సాగాలి
ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
కట్టడి ప్రాంతాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. ఏడునెలల తర్వాత తొలిసారి విద్యార్థులు తమ క్లాసు రూమ్ల్లోకి అడుగుపెట్టారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆవరణలో టీచర్లు వారికి ధర్మల్ స్ర్కీనింగ్ చేసి.. శానిటైజర్లు చల్లి క్లాసులకు పంపించారు. తరగతి గదుల్లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు తగినంత దూరం పాటిస్తూ పాఠాలు విన్నారు. ఒంటి గంటకు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటిదారి పట్టారు. అయితే, అందరూ భయపడినట్టే కరోనా నేపథ్యం పాఠశాల ఉన్నతవిద్యపై తీవ్రప్రభావం చూపించింది. ఊహించినట్టే విద్యార్థులు క్లాసుల్లో పలచగా కనిపించారు. టీచర్లు బాధ్యతపడిన చోట కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యాయి. కొన్నిచోట్ల వారేచొరవ తీసుకొని శానిటైజర్లు, సబ్బులు పిల్లల కోసం కొన్నారు.
అయితే, టీచర్లలో కూడా కరోనా పాజిటివ్ తేలడం పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో కలకలం రేపింది. తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ను ప్రభుత్వం తప్పనిసరి చేయగా, ఆ నిబంధన ఎక్కువ స్కూళ్లలో అమలుకాలేదు. పాఠశాలల్లో ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు పనులు బడుల పునర్ ప్రారంభంనాటికీ కొనసాగుతుండటంతో పిల్లలు అసౌకర్యానికి గురయ్యారు. చెట్ల కింద, స్కూలు ఆవరణల్లో కూర్చొని పాఠాలు విన్నారు. మన రాష్ట్రంలో 9,10 తరగతుల్లో 10,04,989 మంది ఎన్రోల్ కాగా 4,18,251 (42ు) మంది మొదటి రోజు పాఠశాలలకు హాజరయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 9,10 చదివే వారే ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు 98.84 శాతం పాఠశాలలు తెరుచుకున్నాయని తెలిపింది. కృష్ణా జిల్లాలో 99, విశాఖపట్నం జిల్లాలో 86 శాతం స్కూళ్లు తెరుచుకోగా , మిగిలిన జిల్లాల్లో 100 శాతం పనిచేశాయని వెల్లడించింది. 87.77 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యారని, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి, శానటైజ్ చేసుకుని విద్యార్థులు క్లాస్ రూమ్లో పాఠాలు వినేందుకు వచ్చారని మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు కూడా సోమవారం తెరుచుకున్నాయి. సెకండియర్ విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు.
విద్యార్థులు 22.. వచ్చింది ఐదుగురు
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం పాఠశాలలో 228 మంది చదువుతున్నారు. తొలిరోజు ఐదుగురే క్లాసులకు హాజరయ్యారు. టి.నరసాపురం మండలం కేతవరం హైస్కూల్లో 58మందికిగాను ఒక్కరూ బడికి రాలేదు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, సబ్బులను పాఠశాల నిధులతో కొనుగోలు చేసుకుని తర్వాత బిల్లులు సమర్పించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. దీంతో పలు జిల్లాల్లో టీచర్లు తమ జేబు నుంచి ఖర్చుపెట్టాల్సి వచ్చింది. కాగా, విశాఖలో తొలిరోజు 36.8 శాతం, చిత్తూరు జిల్లాలో 20 నుంచి 60శాతం, కర్నూలు జిల్లా ప్యాపిలిలో 10 శాతం హాజరయ్యారు. అనంతపురం జిల్లా శింగనమలలో భోజనం పెట్టకుండానే విద్యార్థులను ఇళ్లకు పంపారు. నెల్లూరు జిల్లాలో 14 శాతమే హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 65 శాతం మంది క్లాసులకు వచ్చారు. ఒక్కో గదికి 16 మందినే అనుమతించారు. క్లాసు పూర్తయ్యాక 15 నిమిషాలు విరామం ఇచ్చారు. కడప జిల్లాలో 56 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 69శాతం హాజరయ్యారు.
జాగ్రత్తలు ఏవీ?!
అత్యధిక పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు నామమాత్రంగా పాటించారు. నెల్లూరు జిల్లాలోని కొన్ని స్కూళ్లలో దుమ్ముపట్టిన తరగతి గదులను విద్యార్థులు, ఉపాధ్యాయులే శుభ్రం చేసుకొన్నారు. కర్నూలు జిల్లా హోలగుందలో ఒకే గదిలో 70 మందిని కూర్చోబెట్టారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాపురం స్కూల్ను ఆగమేఘాల మీద శుభ్రం చేశారు.
మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలికి పాజిటివ్
మధ్యాహ్నం పిల్లలకు వడ్డన.. సాయంత్రానికి రిపోర్టు
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలికి కొవిడ్ పాజిటివ్ తేలింది. అంబాజీపేట పీహెచ్సీలో అక్టోబరు 30న ఆమెకు కొవిడ్ పరీక్షలు చేశారు. సాధారణంగా ఫలితం వచ్చేదాకా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. కానీ, ఆమెను హెచ్ఎం స్కూలుకు పిలిపించి సోమవారం భోజనం తయారు చేయించారు. ఆమే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. సాయంత్రం ఆరు గంటలకు ఫలితం రాగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హైస్కూలులో కలకలం రేగింది
టీచర్లలో 50మందికి కరోనా
కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ టీచర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు, నలుగురు విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలలో ఓ విద్యార్థికి పాజిటివ్ నిర్థారణ అయింది.. నెల్లూరులో వాచ్మన్, ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ తేలినట్టు ప్రభుత్వమే ప్రకటించింది
0 Response to "మొక్కు..బడే"
Post a Comment