తల్లిదండ్రులు అంగీకరిస్తేనే బడికి
ఎప్పుడు బడులు తీసినా రూల్ ఇదే
15 నుంచి సినిమా, ఈత కొలనులు
100 మందితోనే బహిరంగ సభలు
200 మంది లేదా సామర్థ్యంలో 50%తో
ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాలకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ అన్లాక్ 5.0 ఉత్తర్వులు
ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యం
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఒప్పుకొంటేనే విద్యార్థులను స్కూలులోకి అనుమతించాలని, ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం నిర్దేశం మేరకు రాష్ట్రంలో బడులు, కాలేజీలను ఎప్పటినుంచీ తెరిచినా ఇదే నిబంధన పాటించాలని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ అన్లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ట్యూషన్కు వెళ్లిన పిల్లలకు కరోనా సోకడం వంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోవడంతో పాఠశాలల పునఃప్రారంభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ పిల్లాడు స్కూలుకు వెళ్లాలా లేదా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేసింది. ఉన్నత విద్యా సంస్థలను తెరవడంపై సంబంధిత శాఖ.. కేంద్ర హోం శాఖను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పీహెచ్డీ, పీజీ కోర్సులకు సంబంధించిన ల్యాబ్, పరిశోధనాత్మక కార్యకలాపాలకు ఈనెల 15 నుంచి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. అన్లాక్ 5.0లో భాగంగా అదేరోజు నుంచి సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతిచ్చింది. వినోద పార్కులకి, స్విమ్మింగ్ పూల్స్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామాజిక, క్రీడా, వినోద, సాంస్కృతిక, మత సంబంధ, రాజకీయ కార్యక్రమాల్లో వంద మందికి మించి పాల్గొనరాదని స్పష్టం చేసింది. హాల్లో నిర్వహించే కార్యక్రమాలను దాని సామర్థ్యంలో 50 శాతం లేదా గరిష్ఠంగా 200 మందికి పరిమితం చేసింది
0 Response to "తల్లిదండ్రులు అంగీకరిస్తేనే బడికి"
Post a Comment