నూతన విద్యా విధానం-2020: అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన, 8 భాషల్లో ఇ-కోర్సులు, పాఠశాలల్లో సంస్కృతం
కేంద్ర క్యాబినెట్ బుధవారం నాడు ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేస్తూ 'నూతన విద్యా విధానం-2020'కి ఆమోదం తెలిపింది.
దీంతో పాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును కేంద్ర విద్యా శాఖగా మార్చారు. ఈ మార్పులను సూచించిన కమిటీకి మాజీ ఇస్రో చీఫ్ కె కస్తూరి రంగన్ నేతృత్వం వహించారు.
ఈ నూతన విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో రాబోతున్న మార్పులను ప్రకటించారు.
ఉన్నత విద్యా సంస్థలన్నిటినీ ఒకే ఒక్క నియంత్రణ సంస్థ నియంత్రిస్తుందని చెబుతూ, ఎం.ఫిల్ కోర్సును కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు.
నూతన విద్యా విధానంలో ముఖ్యమైన అంశాలు:
- 2035 కల్లా 50 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. 2040 కల్లా అన్ని ఉన్నత విద్యా సంస్థలు విభిన్న కోర్సులను అందించే సంస్థలుగా మారి , ప్రతి విద్యా సంస్థలో 3000 అంత కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.
- అయిదవ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు నేర్పిస్తారు. బోర్డు పరీక్షలు విద్యార్థి సముపార్జించిన జ్ఞానాన్ని పరీక్షించే విధంగా తీర్చి దిద్ది, మూస తరహా పరీక్షలకు స్వస్తి చెబుతారు. పిల్లల రిపోర్ట్ కార్డులలో కేవలం వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇస్తారు.
- విద్యా విధానాన్ని ఇప్పుడున్న 10 + 2 నుంచి 5+3+3+4 గా విభజిస్తారు. మొదటి అయిదు సంవత్సరాలలో ప్రీ ప్రైమరీ నుంచి రెండవ తరగతి వరకు ఉంటాయి. రెండవ దశలో మూడు నుంచి అయిదవ తరగతి, తర్వాత దశలో ఆరు నుంచి ఎనిమిదవ తరగతులు, చివరి నాలుగు సంవత్సరాలలో తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు ఉంటాయి.
- పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని కోర్సులను రెండు భాషలలో అందిస్తారు.
- అన్ని పాఠశాలల్లో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశ పెడతారు. సంస్కృత విద్యాలయాలు కూడా విభిన్న తరహా కోర్సులు అందించే విద్యా సంస్థలుగా రూపాంతరం చెందుతాయి.
- డిజిటల్ విద్య విధానాన్ని అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ స్థాపన. ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు. వర్చ్యువల్ ల్యాబ్స్ అభివృద్ధి.
- ఉన్నత విద్యనభ్యసించేందుకు మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కల్పిస్తోంది. దీంతో ఎవరైనా మధ్యలో కోర్సు వదిలి వెళ్ళిపోతే, తిరిగి చేరినప్పుడు గతంలో వచ్చిన మార్కులను వాడుకునే అవకాశం ఉంటుంది.
- ఉన్నత విద్యా సంస్థలు , ప్రొఫెషనల్ విద్యా సంస్థలను విభిన్న తరహా కోర్సులు అందించే విధంగా తీర్చి దిద్దుతారు.
- దేశంలో 45000 అఫిలియేటెడ్ కాలేజీలు ఉన్నాయి. కాలేజీలకు ఉన్న అక్రెడిటేషన్ ఆధారంగా గ్రేడెడ్ అటానమీలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్సియల్ అటానమీ ఇస్తారు.
- నూతన విద్యా విధానం ద్వారా ప్రపంచంలో ఉన్న టాప్ 100 విదేశీ విశ్వ విద్యాలయాల కేంద్రాలు భారతదేశంలో నిర్వహించేందుకు ఒక కొత్త చట్టం ద్వారా అనుమతులు ఇస్తారు.
- ఐ ఐ టి లలో, ఇంజనీరింగ్ విద్యా సంస్థలలో ఆర్ట్స్ హ్యుమానిటీస్ కోర్సులు, హ్యుమానిటీస్ విద్యార్థులు సైన్స్, ఇతర వృత్తి విద్యలు నేర్చుకునే విధంగా కోర్సులను ప్రవేశ పెడతారు.
- అన్ని కాలేజీలలో, ఉన్నత విద్యా సంస్థలలో లిటరేచర్, సంగీతం, తత్వ శాస్త్రం, ఆర్ట్, డాన్స్, థియేటర్, గణితం, ప్యూర్ అప్లైడ్ సైన్సెస్, సోషియాలజీ, స్పోర్ట్స్, ట్రాన్సలేషన్ విభాగాలు ఉండేటట్లు చూస్తారు.
- అన్ని కాలేజీలకు ఒకే ఒక్క కామన్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష నిర్వహించడం తప్పని సరి కాదు.
- ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు పరిమితికి మించి ఏ ఉన్నత విద్యా సంస్థ ఎక్కువ వసూలు చేసేందుకు వీలు లేదు.
- స్థూల జాతీయ ఉత్పత్తిలో 6 శాతం విద్యా రంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడీపీలో 4.43 శాతం విద్యా రంగానికి కేటాయిస్తున్నారు.
ఆన్ లైన్ లో విద్యను అందించేందుకు ప్రభుత్వం నేషనల్ టెక్నాలజీ ఫోరమ్ ఏర్పాటు చేస్తుంది
0 Response to "నూతన విద్యా విధానం-2020: అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన, 8 భాషల్లో ఇ-కోర్సులు, పాఠశాలల్లో సంస్కృతం"
Post a Comment