స్కూల్ల ప్రారంభంపై కొత్త టెన్షన్‌...అదొక్కటే అసలు సమస్య



కరోనా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. అన్ని రంగాలను ఈ మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. లాక్‌డౌన్‌తో గత విద్యాసంవత్సరం చివరలో మూతబడ్డ పాఠశాలలు.. కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభం కావాల్సిన జూన్‌ 12న తెరుచుకోలేదు. కరోనాతో విద్యావ్యవస్థ సందిగ్ధంలో పడింది. పాఠాలు చెప్పేది ఆన్‌లైన్‌లోనా.. క్లాస్‌రూమ్‌లోనా.. అనే సంశయం నెలకొంది. కొవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల క్షేమం కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తెరపైకి వస్తున్న ఆన్‌లైన్‌ పాఠాలపై పలువురు నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 12 నుంచే నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది.


కొవిడ్‌-19 వ్యాప్తి తగ్గకపోవడంతో విద్యార్థుల క్షేమం కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యలో ఆన్‌లైన్‌ విద్యాబోధన ప్రత్యామ్నాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం తరగతి బోధనే ఉత్తమని పేర్కొంటున్నారు. కాగా కొన్ని పాఠశాలలు ఏప్రిల్‌ నుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధనను అనుసరిస్తున్నాయి. తర్వాత వేసవి సెలవులు కావడంతో కొన్ని వెనక్కి తగ్గాయి.

కరోనా నేపథ్యంలో పలు ప్రైవేట్‌ సంస్థలు, వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ బోధన ఉచితంగా అందిస్తామంటున్నాయి. ఆన్‌లైన్‌ సంస్థలు ఒకడుగు ముందుకేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరుతున్నాయి. కొంత కాలం పాటు ఉచితమంటూ ఎరవేస్తున్నాయి. కొన్ని సంస్థలు కొంత కాలం ఉచితంగా అందజేసి తర్వాత రుసుం వసూలుచేస్తున్నాయి. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం కూడా టీ -శాట్‌ చానల్‌ ద్వారా పాఠాలు బోధించింది. కానీ పాఠశాలలు తెరవడమా.. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడమా అన్నది ప్రభుత్వ ఆదేశాలపైనే ఆధారపడింది. కొత్త విద్యాసంవత్సరం సాగుతుందా.. పిల్లల్ని బడికి పంపిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటప్పుడు స్కూళ్లు నడిచేదెలా అన్నది అనుమానంగానే మిగిలిపోయింది. సహజంగానే ప్రభుత్వ స్పందన కోసం ఆయా వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "స్కూల్ల ప్రారంభంపై కొత్త టెన్షన్‌...అదొక్కటే అసలు సమస్య"

Post a Comment