ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో
ఇతర నిర్మాణాలొద్దు: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల
స్థలాల్లో గ్రామ సచివాలయం వంటి నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు
ఆదేశించింది. పాఠశాలల ప్రాంగణాల్లో పాఠశాలల కార్యకలాపాలకు సంబంధం లేని
నిర్మాణాలను చేపట్టడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు, జాతీయ విద్యా విధానానికి,
రాజ్యాంగంలోని అధికరణలు 21, 21ఏలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పాఠశాలల్లో
అలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య
కార్యదర్శి, కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లను ఆదేశించింది. పూర్తి
వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా
వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు
ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా తిరువోలులోని మండల ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో
గ్రామ సచివాలయం నిర్మాణం చేపడుతున్నారంటూ పాఠశాల పూర్వ విద్యార్థులు
బి.కోటేశ్వరరావు, మరో 10 మంది హైకోర్చలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై
వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వ్యాజ్యంలో
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల
ఇది అత్యంత కీలక విషయమని తెలిపారు. తిరువోలు ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో
ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టరాదని అధికారులను ఆదేశించారు.
0 Response to "ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలొద్దు: హైకోర్టు"
Post a Comment