జూలై 1 నుంచి తెలంగాణలో మోగనున్న బడిగంట.. ఆది, సోమవారం సెలవు, నో గేమ్స్



దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 5వ దశ నడుస్తోంది. కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైంది. ఫ్యాక్టరీలు, ఆఫీసులు తిరిగి తెరుచుకున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరుగుతున్నాయి. త్వరలో హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ప్రార్థనా మందిరాలు కూడా ఓపెన్ కానున్నాయి. ఇదే క్రమంలో స్కూల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఆగస్టు నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ పై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. జులై 1 నుంచి రాష్ట్రంలో బడులు తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.



కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి పర్మిషన్ వస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేయనున్నారు.

పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు: 
* జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. 
* ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు. 
* ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు. 
* జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు. 
* ప్లే గ్రౌండ్‌లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి. 
* 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.
* ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. 
* ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. 
* ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్‌ను 70 శాతానికి తగ్గిస్తారు. 
* మొత్తం పని దినాలను 150 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. 
* 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఆదివారం మాత్రమే సెలవు.
* పాఠశాల పని గంటల్లో ఒక గంటను తగ్గించారు. 
* 8-10 తరగతులకు ప్రతి రోజూ క్లాసులు.
* ఉన్నత పాఠశాల విద్యార్థులు కౌమారదశలో ఉంటారు. వారికి వారంలో 5 రోజులు తరగతులు నిర్వహిస్తే సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు వ్యవసాయ, ఇతర పనుల్లో నిమగ్నమై పిల్లల క్షేమాన్ని అంతగా పట్టించుకోరు. అందుకే వీరికి వారంలో 6 రోజులు తరగతులుంటాయి.
* కరోనా కారణంగా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పాయింట్ల పెంపు.. ఒక్కో తరగతికి వేర్వేరుగా భోజనాన్ని అందజేసే విధానం.

మొత్తంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అన్నీ మారిపోయాయి. జీవితమే తలకిందులైంది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో ముప్పుతప్పదని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతీ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. అందుకే స్కూల్స్ తిరిగి ప్రారంభించాక కొత్త కొత్త రూల్స్ అమలు కానున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జూలై 1 నుంచి తెలంగాణలో మోగనున్న బడిగంట.. ఆది, సోమవారం సెలవు, నో గేమ్స్"

Post a Comment