తెలంగాణలో 29 దాకా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావాల్సిందల్లా ప్రజల సహకారమేనని, కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఆయన ప్రగతిభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే... 



రెడ్‌జోన్
1. హైదరాబాద్, 2. రంగారెడ్డి, 3. వికారాబాద్, 4. మేడ్చల్‌, 5. సూర్యాపేట, 6. వరంగల్‌ అర్బన్‌

ఆరెంజ్‌ జోన్‌
7. ఆదిలాబాద్, 8. నిర్మల్, 9. ఆసిఫాబాద్, 10. నిజామాబాద్,  11, జగిత్యాల, 12. మంచిర్యాల, 13. కామారెడ్డి, 14. సిరిసిల్ల, 15. మెదక్, 16. సంగారెడ్డి, 17. జయశంకర్‌ భూపాలపల్లి, 18. జనగాం, 19. మహబూబ్‌నగర్, 20. నల్లగొండ,21. ఖమ్మం, 22. జోగులాంబ గద్వాల, 23. కరీంనగర్, 24. నారాయణ్‌పేట్‌

గ్రీన్‌జోన్‌
25. సిద్దిపేట, 26. యాదాద్రి భువనగిరి, 27. వరంగల్‌ రూరల్, 28. మహబూబాబాద్, 29. భద్రాద్రి కొత్తగూడెం, 30. వనపర్తి, 31.నాగర్‌కర్నూల్, 32. పెద్దపల్లి, 33. ములుగు

కరీంనగర్‌ను కాపాడగలిగాం..
ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు, కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా మనల్ని కూడా పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,096 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 628 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయి వెళ్లిపోయారు. మంగళవారం మరో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 11 మందికి కొత్తగా ఈ రోజు పాజిటివ్‌ వచ్చింది. వారందరినీ ఆస్పత్రుల్లో చేర్చారు. మొత్తంగా ఇప్పుడు 439 మంది చికిత్స పొందుతున్నారు. ముందు నుంచీ కరోనా విషయంలో మనం చాలా కఠినంగా, ఒక పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించాం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కరీంనగర్‌. అప్పుడు దేశంలో ఎవరికీ కంటైన్మెంట్‌ అనేది తెలియదు. ఫస్ట్‌ ఇన్‌ ఇండియా.. కరీంనగర్‌లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఇండోనేసియా దేశస్తులు 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారు ఇక్కడ చాలా కాలం ఉన్నారు. దీంతో చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. ఒక్క చావు లేకుండా కరీంనగర్‌ను కాపాడగలిగాం. ఇందుకు కృషి చేసిన వైద్య మంత్రి ఈటల రాజేందర్, స్థానిక మంత్రి గంగుల కమలాకర్, వైద్య సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు అందరికీ ప్రత్యేక అభినందనలు. అక్కడ 100 శాతం సక్సెస్‌ అయ్యాం. దేశానికే పూర్తిగా రోల్‌మోడల్‌ అయ్యాం.

మన నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకుంది. మనం కూడా కరీంనగర్‌ ఘటన తర్వాత చాలా నేర్చుకుని మిగతా ప్రాంతాల్లో అదే పద్ధతిలో ఎలా కట్టుదిట్టం చేయాలన్నది అమలు చేశాం. ఇక కరోనా మరణాల విషయంలో దేశ సగటు 3.37% ఉంటే మన రాష్ట్రంలో 2.64% ఉంది. ఇది దేశ సగటు కన్నా తక్కువ. యాక్టివ్‌ కేసులు దేశ సగటు 69.21 శాతం ఉంటే, రాష్ట్రంలో 42.7% ఉంది. రికవరీ రేటు దేశంలో 27.40% ఉంటే, రాష్ట్రంలో 57.3% ఉంది. ఏ పారామీటర్‌లో చూసుకున్నా మనం దేశసగటు కన్నా మెరుగ్గా ఉన్నాం. చాలా చక్కగా ముందుకు పోతున్నాం. ఇందుకోసం పనిచేసిన నాయకులు, అధికారులు, వైద్యసిబ్బంది, పోలీస్, ఇతరత్రా సిబ్బంది, ప్రత్యేకించి కలెక్టర్లకు హృదయ పూర్వక అభినం దనలు. ఈ కృషి ఇలానే కొనసాగాల్సిన అవసరం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలంగాణలో 29 దాకా లాక్‌డౌన్‌"

Post a Comment