ప్రైవేటు స్కూళ్ల ఫీజుకు మూడు కొలబద్దలు

- ప్రతి పాఠశాలకు నిర్ణయిస్తాం 
- వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు
- ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 
- పాఠశాల విద్య కమిషన్‌ చైర్మన్‌ కాంతారావు 
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో 
ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులను మూడు విభాగాల్లో నిర్ధారించే ఆలోచనలో ఉన్నట్లు ఎపి పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌(ఎపిఎస్‌ఇఆర్‌ఎంసి) చైర్మన్‌ రెడ్డి కాంతారావు తెలిపారు. కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ విజయశారదా రెడ్డితో కలిసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లా డారు. 28, 29 తేదిల్లో జరిగిన కమిషన్‌ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు




నగర, అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలుగా పాఠశాలలను విభజిస్తామని పేర్కొ న్నారు. పాఠశాల ప్రాంతం, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతభత్యాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తామన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు కల్పించాల్సిందేనని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం ఈ విధానాన్ని అమలు చేస్తామని, ప్రతి పాఠశాలకూ విడివిడిగా ఫీజులు నిర్ధారిస్తామని చెప్పారు.

ప్రతి స్కూల్‌ యాజమాన్యమూ దీనిని అమలు చేయాల్సిందేనని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంజనీరింగ్‌ కళాశాలల తరహాలో భవిష్యత్తులో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ఫీజులు చెల్లించే విధానంపై కసరత్తు చేస్తామన్నారు. కొత్త పాఠశాలల ఏర్పాటు, రెన్యువల్‌ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటాయన్నారు. జనవరి నాటికి అనుమతులు ఇస్తామని తెలిపారు.ఫిబ్రవరిలో ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

కమిషన్‌ త్వరలోనే ఒక పోర్టల్‌ ఏర్పాటు చేస్తుందని, అందులో పాఠశాలలు, కళాశాలల వాటి వివరాలను నిర్ణీత సమయంలోగా అప్‌లోడ్‌ చేయాలని కోరారు. పాఠశాలల తనిఖీ చేయడానికి ప్రస్తుతం తమకు సిబ్బంది లేరని, పాఠశాల విద్యాశాఖ సహాకారం కోరతా మన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 20 మంది సిబ్బంది ఉండేలా చూస్తామన్నారు. డిఇఓ నుంచి ఎంఇఓ వరకు ప్రతి రోజు పాఠశాలలు తనిఖీ చేసేలా సూచనలు చేస్తామన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి మొదలు కానున్న ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌ను తనిఖీ చేస్తామన్నారు. ఇంటర్మీడియేట్‌ ప్రాక్టికల్స్‌ అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన్నట్లు తెలిపారు. విద్యార్థుల చేత ప్రాక్టికల్స్‌ చేయించకుండానే మార్కులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంస్కృతి తెలిసేలా, వీటిని అరికట్టేలా పాఠ్యాంశాల్లో తగిన మార్పులు చేసేలా ప్రతిపాదిస్తా మన్నారు. విద్యార్ధిలనులపై లైంగిక వేధింపులకు పాల్పడే బోధన, బోధనేతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేలా విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. నెలరోజుల్లోగా విచారణ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తామన్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పనిచేస్తున్న ప్రాంతంలో కూడా వేరే ప్రాంతంలో బదిలీ అయ్యేలా చర్యలు ఉండేలా చూస్తామన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రైవేటు స్కూళ్ల ఫీజుకు మూడు కొలబద్దలు"

Post a Comment