బడుల్లో తెలుగు వెలగాల్సిందే
- ఆంగ్ల మాధ్యమం విజయవంతం కాదు
- ప్రభుత్వం పంథా మార్చుకోవాలి
- చట్ట ప్రకారం మాతృ భాషలోనే బోధన
- ప్రపంచ మహాసభల్లో వక్తలు
- ముగింపు రోజున 11 తీర్మానాలకు ఆమోదం
విజయవాడ/కల్చరల్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘బడిలో
తెలుగు గంటలు మోగాలి. తెలుగే వెలగాలి. తెలుగు బోధనే అమలు చేయాలి’ అని
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తీర్మానించాయు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని
బలవంతంగా అమలుచేయాలన్న ప్రభుత్వ విధానం విజయవంతం కాదని పలువురు వక్తలు
అభిప్రాయపడ్డారు. కచ్చితంగా ప్రభుత్వం పంథా మార్చుకోవాలని ముక్తకంఠంతో
నినదించారు. విజయవాడలో మూడు రోజులపాటు వేడుకగా జరిగిన మహాసభలు ఆదివారంతో
ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ఆంగ్ల
మాధ్యమంలో బోధన విజయవంతం కాదని తేల్చిచెప్పారు. నిరక్షరాస్యతను పూర్తిగా
తొలగించటం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. తెలుగు మాధ్యమ బోధన
కోసం
ప్రతిజిల్లాలోనూ రచయితల మహాసభలు నిర్వహించాలన్నారు. తానా మాజీ
అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ మాతృభాషలో బోధనతోనే మానసికంగా
ఎదుగుదల ఉంటుందన్న భాషా శాస్త్రవేత్తల సూచన గమనించి ప్రభుత్వాలు నిర్ణయాలు
తీసుకోవాలని కోరారు
ప్రభుత్వ మాజీ
సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, భాషకు ముప్పువాటిల్లే ప్రభావం
ఉందన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని,
ప్రస్తుత స్థితి నుంచి తెలుగు చదువుకోకపోతే పిల్లలు పనికిరారనే స్థితికి మన
భాషను తీసుకువెళ్లాలన్నారు. సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
మాట్లాడుతూ పరాయి భాషలో చదివి గొప్పవాళ్లుగా చరిత్రకెక్కిన దాఖలాలు
లేవన్నారు. తెలుగు జాతి అభ్యుదయాన్ని ఆపివేసినట్లుగా తెలుగువారిలో మానసిక
కల్లోలాన్ని సృష్టించేలా రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ఉందని, దీనిద్వారా వచ్చే
ప్రకంపనల అలజడి ప్రభుత్వాన్ని కదిలించే పరిస్థితికి తీసుకువస్తుందని
హెచ్చరించారు. సభలో జిస్టిస్ కె.జి.శంకర్, మారిషస్ ప్రతినిధి సంజీవ
అప్పడు, ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఆచార్య డానియేల్, కె.సూర్యనారాయణ, ఎం.పి.జాను
కవి, పి.ఆర్.మోహన్రావు, అనంత శ్రీరామ్, నందివెలుగు ముక్తేశ్వరరావు,
సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, ఎం.వి.ఆర్.శాస్త్రి,
తెలంగాణకు చెందిన సాహితీవేత్త లింగం శ్రీనివాసులు ప్రసంగించారు. ఈ సభలో
తెలుగు భాషాభివృద్ధి కోసం మొత్తం 11 తీర్మానాలను ఆమోదించారు.
తెలుగులోనే శాసనాలు: జస్టిస్ భవానీప్రసాద్
‘తెలుగువారు
మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. 1966లో అధికార భాషా
చట్టాలు చేసుకున్నాం. రాజ్యాంగంలో భాషల గురించి చక్కని వివరణ ఇచ్చారు.
1996లో న్యాయశాఖ కార్యదర్శిగా నేను పని చేసినప్పుడు కొన్ని చట్ట సవరణలు
చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాసనం, ఉత్తర్వులు, ఉత్తర
ప్రత్యుత్తరాలు తెలుగు భాషలోనే ఉండాలని చట్టం ఉంది. దానికి అనుగుణంగా
అధికార భాష చట్టప్రకారం మాతృభాషలోనే బోధన జరగాలి. నల్లగొండ జిల్లాలో
కలెక్టర్ ముక్తేశ్వరరావు పని చేసినప్పుడు పరిపాలనంతా తెలుగులోనే
సాగించారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో
ఎందుకు చేయలేరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
న్యాయస్థానాల్లో నెలకు రెండు తీర్పులైనా తెలుగులో ఇవ్వాలనేలా చట్టం చేశారు.
ప్రస్తుతం తెలుగు భాషా మాధ్యమం తొలగించే అంశం హైకోర్టులో ప్రజాప్రయోజన
వ్యాజ్యంగా వేశారు. అది విచారణలో ఉంది.’
మేధావుల మౌనం మంచిది కాదు: రెంటాల
భాషకు
అన్యాయం జరుగుతున్నప్పుడు మేధావులు, రచయితలు మౌనం వహించడం మంచిది కాదని
‘ఆంధ్రజ్యోతి’ నవ్య ఇన్చార్జి రెంటాల జయదేవ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం
మాతృభాష పరిస్థితి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న స్థాయి నుంచి లెస్....ఆ?
అనే స్థాయికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల
మహాసభలు ప్రజల ఆందోళనను వినిపిస్తున్నాయన్నారు. దక్షిణాదిలో తమిళనాడు,
కేరళ, కన్నడ వాసుల్లో ఉన్న భాషాభిమానం తెలుగు వారిలో లేకపోవడానికి కారణం
ఏమిటో ఆలోచించుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన
తర్వాత మాతృభాషకు తెలంగాణలో ఉన్న ప్రాధాన్యం మన రాష్ట్రంలో లేకపోవడం
దారుణమన్నారు. ఇంట్లో పిల్లలకు మమ్మీ, డాడీ, రైస్, కర్రీ వంటి పదాలు
నేర్పుతున్నారని, వాటికి బదులు అచ్చ తెలుగు పదాలైన అమ్మ, నాన్న, అన్నం, కూర
వంటి పదాలు నేర్పించడం మొదలుపెట్టాలని విజ్ఞప్తి చేశారు. పత్రికారంగంలో
ఉన్న ఉద్యోగుల ఇళ్ల నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆకాక్షించారు.
తెలుగువారి సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే వీధినాటకాలు, జాంబపురాణం
వంటి వాటిపై డాక్యుమెంటరీలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని
సజీవంగా నిలిపిన రోజున భాషకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండవని జయదేవ
అభిప్రాయపడ్డారు
0 Response to " బడుల్లో తెలుగు వెలగాల్సిందే"
Post a Comment