పాఠాలన్నీ మైదానంలోనే!

బరువైన బ్యాగుని భుజాన వేసుకుని పుస్తకాల భారంతో బడికి వెళ్లే బుజ్జాయిలు మనకు పరిచయమే. పేజీలకు పేజీలు హోంవర్క్‌ చేయించే పాఠశాలలూ ఎక్కువే. వరంగల్‌లోని ఓ స్కూల్‌ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. పాఠాలని మైదానంలోనే బోధిస్తోంది.

ఆ స్కూల్లో రైతుబజారు ఉంటుంది. ఆ బజారులో కాయగూరలు అమ్మేవాళ్లు, కొనేవాళ్లు కూడా విద్యార్థులే. చక్కగా బేరమాడి కావాల్సిన కాయగూరలు కొనుక్కుంటారు. ఆ బడి ఆవరణలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉంటాయి. చిన్నారులే ఆ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ చూసుకుని స్వయంగా రోడ్డు దాటుతారు. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లతో పాటు కఠినమైన పాఠాలని కూడా ఇలా పాఠశాల ఆవరణలో బోధించడమే ఆ స్కూల్‌ ప్రత్యేకత


పిల్లలకు ఇష్టమైన వాటిలో ఆటలు ముందుంటాయి. అందుకే పాఠాలనే ఆటపాటల్లోకి మార్చి బోధిస్తున్నాం అంటున్నారు వరంగల్‌లోని గణపతి ఎర్లీ లెర్నింగ్‌ స్కూలు నిర్వాహకురాలు అనూష.



'అక్షరాలను గుర్తు పట్టడం, ఎక్కాలు నేర్పించడం, ఆంగ్ల అక్షరమాల, అంకెలు, సంఖ్యలు ఏవైనా సరే తరగతిగదిలో నేర్పించం. మైదానంలోనే నేర్పిస్తాం. అదికూడా వారికి అర్థమయ్యేలా ఆటల రూపంలోనే. ఉదాహరణకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వాటి ఉపయోగం, యోగా తరగతులు, ఏటీఎం యంత్రం పనితీరు వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూపిస్తూ వారితోనే చేయిస్తాం. చిన్నారులందరికీ కూరగాయల గురించి తెలిసేలా మా స్కూల్లో రైతు బజారును ఏర్పాటు చేశాం. మా చిన్నారి రైతులు కూరగాయల పేర్లు తెలియని వయసులో ఏకంగా మార్కెట్‌నే నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో వాటిపేర్లను వారెప్పుడూ మరిచిపోరు' అంటున్నారు అనూష.

- కర్పనస్వామి చిన్నబాబు, న్యూస్‌టుడే, వరంగల్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠాలన్నీ మైదానంలోనే!"

Post a Comment