మాతృభాషలోనే విద్యాబోధన

  • ఆంగ్లం కోసం ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ నేర్పిస్తే సరి
  • చరిత్ర పరిశోధకులు రంజిత్‌కుమార్‌
పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని ప్రముఖ చరిత్ర పరిశోధకులు రంజిత్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. మాతృభాషపై పట్టు లేకుండా, వేరే ఏ భాషా నేర్చుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడి విద్యార్థులకు ఆంగ్లం రావాలన్నా తెలుగుపై పట్టు ఉండటం తప్పనిసరి. ఎన్నో పరిశోధనలూ ఇదే విషయాన్ని తేల్చిచెప్పాయి. ఒక భాష మాట్లాడటం రావాలంటే ఆ భాషలో విద్యాభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. ఆంగ్లం రావాలంటే ఇంగ్లిష్‌ మాధ్యమం తప్పనిసరి కాదు. పాఠశాల స్థాయిలోనే ‘‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’’ నేర్పితే సరిపోతుంది’ అని ఆయన వివరించారు



బ్రిటష్‌ వలస దేశాల్లోనే ఆంగ్లం
తరగతి గదిలో అధ్యాపకుడు మాతృభాష వాడితేనే పిల్లలకి విషయం స్పష్ణంగా అర్థమవుతుందని, ఈ అంశంపై లోతైన పరిశోధన చేసినట్లు రంజిత్‌కుమార్‌ తెలిపారు. దీనికోసం 10లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలను (170) పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన పరిశోధనలో బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఉదహరించారు.
  •  మనం ఇంగ్లి్‌షను విద్యలో మాధ్యమంగా ఎలా ఉపయోగిస్తున్నామో, అలానే బ్రిటిష్‌ పాలన అనుభవించిన ఎన్నో ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఫ్రెంచ్‌, స్పానిష్‌, పోర్చుగల్‌ వలస పాలన ఉన్నచోట్ల ఫ్రెంచ్‌, స్పానిష్‌, పోర్చుగీసు భాషలను ఉపయోగిస్తాయి.
  •  2017 వరకూ నోబెల్‌ బహుమతి (శాంతి బహుమతి మినహా) పొందినవారిలో 98శాతం పైగా మాతృభాషలో విద్యను బోధించే దేశాలకి చెందినవారే.
  •  కొనుగోలు శక్తి ఆధారిత తలసరి ఆదాయం దృష్ట్యా ప్రపంచంలోని తొలి 30 దేశాల్లో 28చోట్ల మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతోంది. సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ పేరుకు దేశాలే అయిన వాటి జనాభా మన ముంబై అంత కూడా ఉండదు. కనుక అక్కడి విధానాలు మనకుకు ఆదర్శం కాదు.
  •  ప్రపంచీకరణకు ఇంగ్లిష్‌ తప్పనిసరి అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. కానీ అందులో నిజం లేదు. కేఓఎఫ్‌ గ్లోబలైజేషన్‌ సూచీ-2018లో భాగమైన మొదటి 50 దేశాల్లో 48 మాతృభాషనే వాడుతున్నాయి.
  •  ఆధునిక పరిశోధనలు చెయ్యడానికి ఇంగ్లిష్‌ తప్పనిసరి అని మరొక భావన కూడా ఉంది. అదికూడా తప్పే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణల సమార్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి ఏటా నివేదిక ఇచ్చే ‘‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌’’, ‘‘బ్లూమ్బెర్గ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌’’ జాబితాలలో మొదటిది 40- 50 స్థానాల్లో ఉండే 90శాతంపైగా దేశాలూ మాతృభాషనే తమ విద్యాబోధనలో ఉపయోగిస్తాయి. జాంబియా, టాంజానియా, ఘానా వంటి ఎన్నో ఆఫ్రికా దేశాలు సైతం మాతృభాషలో విద్యాబోధన మొదలు పెడుతుంటే, మనం మాతృభాషలో బోధిస్తున్న పాఠశాలలను కూడా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడం దురదృష్టకరం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " మాతృభాషలోనే విద్యాబోధన"

Post a Comment