తెల్ల పులుల స్థావరం.. బంధవ్‌ ఘర్‌!

తెల్ల పులులకు అసలైన స్థావరంగా పేరుపొందింది మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌ ఘర్‌ నేషనల్‌ పార్క్‌. చరిత్ర రికార్డుల ప్రకారం, రేవా మహారాజా వేట ప్రాంతమే ఈ బంధవ్‌ ఘర్‌. ఇక్కడి పురాతన కోట దీనికి ఆధారం. నేటికీ ఈ కోట ఇక్కడి అడవి కంటే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. నేషనల్‌ పార్క్‌గా ఈ ప్రాంతం మారక ముందు బంధవ్‌ ఘర్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా వేటగాళ్లకు ప్రఖ్యాతి చెందిన ప్రాంతం. ప్రభుత్వం పులుల సంరక్షణ కోసం చర్యలు చేపట్టడంతో వేట ఒకప్పటి రాచరికపు ఆనందంగా మిగిలిపోయింది. పులుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభించింది. ఇక్కడి ప్రకృతి ఒడిలోని విస్తృత జీవవైవిధ్యం కారణంగా బంధవ్‌ ఘర్‌ నేషనల్‌ పార్క్‌గా 1968లో ప్రపంచానికి పరిచయమయింది



పులులతో పాటు ఇందులో అత్యధిక శాతం చిరుతలు, వివిధ రకాల జింకలు కనిపిస్తాయి. అనేక అరుదైన ఇతర జంతువులనూ ఇక్కడ గమనించవచ్చు. దాదాపు 257 జాతుల పక్షులు, 37 రకాల క్షీరదాలు, దాదాపు 80 రకాల సీతాకోకచిలుకలు ఇంకా ఎన్నోరకాల సరీసృపాలు నేషనల్‌ పార్క్‌లో ఉన్నాయి. వీటితోపాటు వివిధ రకాల వృక్ష జాలం ఉంది.

సాల్‌, దోబిన్‌, సాలై, సాజా ఇంకా మరికొన్ని వీటిలో చెప్పుకోదగినవి. ఇక్కడ తిరిగే పెద్ద అడవి పిల్లుల గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించాలనుకునేవారు బంధవ్‌ ఘర్‌లో కనీసం మూడు రోజులు గడపాలి. ఈ పార్క్‌లోని అతి లోతైన ప్రదేశాన్ని 'తలా'గా పిలుస్తారు.

చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలైన వింధ్యా లోయ అందాలతోపాటు, బంధవ్‌ ఘర్‌ కోటని చూసి తీరాల్సిందే! ఈ శ్రేణి మొత్తం ఒక దానితో ఒకటి మిళితమై ఉంటాయి. చుట్టూ లోయలతో కనిపించే ఈ ప్రాంతం 'బోహేరా' అనే పచ్చికబయలులో ముగుస్తుంది. ఇక్కడికి సమీపాన జబల్పూర్‌లో ఉన్న విమానాశ్రయం ఇంకా రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. బంధవ్‌ ఘర్‌ అక్టోబర్‌ నుంచి మార్చి వరకు సందర్శించేందుకు మంచి సమయం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెల్ల పులుల స్థావరం.. బంధవ్‌ ఘర్‌!"

Post a Comment