వెయ్యి మందికి ఒక్క టీచర్ పాస్
పరీక్ష రాసింది 12 వేలు.. పాసైంది 12 మంది
డిపార్ట్మెంటల్ పరీక్షల్లో చిత్రం..
నెగిటివ్ మార్కులతో బెంబేలు
పేస్కేళ్లు, ప్రమోషన్లపై ప్రభావం..
ఏపీపీఎస్సీకి వినతుల వెల్లువ
అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): దాదాపు 12 వేల మంది పరీక్ష రాశారు. కానీ, పాసైంది మాత్రం 12 మందే! ఇదంతా చిత్రంగా ఉంది కదూ.. కానీ, నిజం!! ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షల విధానం ఉద్యోగులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి తాజాగా ప్రవేశ పెట్టిన నెగిటివ్ మార్కుల విధానం వారి ఆశలపై నీళ్లుజల్లుతోంది. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఆన్లైన్(కంప్యూటర్ ఆధారిత) పరీక్షా విధానంతో ఇబ్బందులు పడుతున్న పాత టీచర్లు.. ఇటీవల ప్రవేశ పెట్టిన నెగిటివ్ మార్కులతో పూర్తిగా డీలా పడుతున్నారు. విద్యాశాఖకు సంబంధించి ఏపీపీఎస్సీ ఈ ఏడాది జూన్ 15న నిర్వహించిన గెజిటెడ్ ఆఫీసర్స్(జీవో) టెస్ట్ ఫలితాలు ఉపాధ్యాలకు మింగుడుపడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల మంది ఎస్జీటీ, ఎస్ఏ టీచర్లు ఈ పరీక్షలకు హాజరు కాగా కేవలం 12 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే వెయ్యికి ఒక్కరు చొప్పున మాత్రమే పాసయ్యారు. అలాగే జూన్ 16న నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్(ఈవో) పరీక్షకు వేలాది మంది హాజరు కాగా కేవలం 3,131 మందే పాసయ్యారు. ఈ ఫలితాలతో టీచర్లు సహా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
ప్రమోషన్ వేటలో పరీక్ష
డిపార్ట్మెంటల్ టెస్టులు రాసే వారిలో సింహభాగం సీనియారిటీ ఉన్న వారే. 24 సంవత్సరాల స్కేలు పొందటానికి సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ), 12 ఏళ్ల స్కేల్ కోసం స్కూల్ అసిస్టెంట్లు(ఎ్సఏ), హెడ్మాస్టర్లుగా ప్రమోషన్ కోసం 50 ఏళ్లలోపు వయసున్న స్కూల్ అసిస్టెంట్లు ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులకు హాజరై ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. వీటిలో పాస్ అయితేనే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఎంత సర్వీసు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులురావు. కాగా, ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాలు జగన్ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి
0 Response to "వెయ్యి మందికి ఒక్క టీచర్ పాస్"
Post a Comment