చంద్రయాన్ 2 అద్భుతం సృష్టించనుంది..!
- చంద్రయాన్-2లో చివరి ఘట్టం
- నేటి రాత్రి1:40-1:55 మధ్య
- జాబిలిపై ‘విక్రమ్’ ల్యాండింగ్!
- ఆ 15 నిమిషాలూ ఎంతో టెన్షన్
- ప్రపంచం చూపంతా విక్రమ్ వైపే!
- ఊపిరి బిగపట్టిన ఇస్రో శాస్త్రజ్ఞులు
శ్రీహరికోట(సూళ్లూరుపేట), సెప్టెంబరు 5: ఇస్రో చంద్రోదయానికి సమయం సమీపిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-2 ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ల్యాండర్ ‘విక్రమ్’.. చంద్రుడిపై పాదం మోపే వేళయింది. శుక్రవారంఅర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. ఇస్రో శాస్త్రవేత్తల కఠోరశ్రమకు ఫలితం దక్కాలని.. 48 రోజుల అద్భుత ప్రయాణం విజయవంతంగా ముగియాలని 130 కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచదేశాల చూపూ విక్రమ్ వైపే ఉంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం.. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ను గురువారం నాటికి చంద్రుడికి 35 కి.మీ. దగ్గరగా, 101 కి.మీ. దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆర్బిటర్ చంద్రుడికి 96 కి.మీ దగ్గరగా, 125 కి.మీ దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది. మిగిలింది.. విక్రమ్ను చంద్రుడిపై దించడమే!
ఉత్కంఠభరిత పావుగంట..
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే శనివారం తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల నడుమ.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్స-సి, సీంపేలియ్స-ఎన్ అనే రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్కు అమర్చిన అర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్బీ) ద్వారా అన్వేషించనున్నారు. అక్కడ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు ఇస్రోకు చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. అలా అరగంటలో స్థల అన్వేషణ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. 1.40 నుంచి 1.55 గంటల మధ్య... అంటే 15 నిమిషాలపాటు ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. ఇస్రో చీఫ్ కె.శివన్ ‘15 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా అభివర్ణించిన సమయం ఇదే. ఎందుకంటే.. ఈ 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ 15 నిమిషాలలో ప్రతి క్షణం ఇస్రో శాస్త్రవేత్తలకే కాదు.. ఈ ల్యాండింగ్ను వీక్షించే ప్రతి ఒక్కరికి ఊపిరిబిగబట్టే ఉత్కంఠ కలగజేయనుంది.
4 గంటల తర్వాత
విక్రమ్ ల్యాండర్ను శనివారం తెల్లవారుజామున 1.55 గంటలకు జాబిల్లిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత.. అంటే ఉదయం 5.30 నుంచి 6.30 గంటల మధ్య అందులోంచి 27 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగి ఉండే ప్రజ్ఞాన్ రోవర్ వెలుపలికి వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు చేయనుంది. ఆ సమయంలో అది విక్రమ్ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్కు చేరవేస్తుంది. విక్రమ్ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్స్పేస్ నెట్వర్క్కు అందుతుంది.
‘పావుగంట ఉత్కంఠ’.. ఎందుకు?
భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి (భూమితో పోలిస్తే చాలా తక్కువగా) ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్.. మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ఉండేందుకు విక్రమ్లోని డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ అది చంద్రుడిపై నెమ్మదిగా దిగేలా ఇస్రో శాస్త్రజ్ఞులు ఏర్పాట్లు చేశారు. విక్రమ్ అలా నెమ్మదిగా దిగడానికి పావుగంట సమయం పడుతుంది. ఇంత క్లిష్టం కనుకనే ల్యాండింగ్ను ‘15 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా వ్యవహరిస్తున్నారు. శాస్త్రజ్ఞుల కృషి ఫలించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. విక్రమ్ విసురుగా వెళ్లి చంద్రుడిపై కూలిపోకుండా, మృదువుగా ల్యాండ్ అవుతుంది. ఇలా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది.
ప్రధానితో పాటు విద్యార్థులు
ఇంత కష్టతరంగా నిర్వహిస్తున్న విక్రమ్ ల్యాండింగ్ను ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించనున్నారు. దేశవ్యాప్తంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ఇస్రో నిర్వహించిన పోటీల విజేతల్లో రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ప్రధానితో కలసి ఈ ల్యాండింగ్ను తిలకిస్తారు.
ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం తెల్లవారుజామున 3.42 గంటలకు చంద్రుడి కక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 2లోని ల్యాండర్ లో ఉన్న ఇంధనాన్ని 9 సెకండ్ల పాటు మండించారు. బెంగళూరులోని బైలాలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి వారు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో దూరంగా ఉన్న కక్ష్యలోంచి చంద్రయాన్ 2 చంద్రుడికి దగ్గరగా 35కి.మీల దూరంలోని కక్ష్యలోకి వచ్చింది
ఇక అత్యంత కీలకమైన దశలో ల్యాండర్ను చంద్రుడిపై దించే ఘట్టాన్ని అర్ధరాత్రి 1.30 గంటల నుంచి 2.30 మధ్య నిర్వహించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. ల్యాండర్ను చంద్రుడి ఉపరితలం పైకి 35 కి.మీల ఎత్తునుంచి జాగ్రత్తగా దించుతారు. ల్యాండర్ దిగగానే అందులోంచి కొద్దిసేపటికి రోవర్ చంద్రుడి మీదకు దిగుతుంది. ఇది 14 రోజుల పాటు ప్రయాణిస్తూ పరిశోధనలు చేస్తూ ఫొటోలు తీసి భూమికి పంపుతుంది. మరోవైపు చంద్రయాన్ 2 మాత్రం చంద్రుడి చుట్టూ 96 కిమీల దగ్గరైన వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ కిందనున్న ల్యాండర్ కదలికలను
Full details..
జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్కు ఇంకా కొన్ని గంటలే
చరిత్రలో నిలిచిపోనున్న భారత్ ఘనత
ల్యాండింగ్ టైం: రేపు తెల్లవారు జామున 1.30– 2.30 (నేటి అర్ధరాత్రి దాటాక) మధ్యలో..
చందమామ రావే.. జాబిల్లి రావే.. అని అమ్మలు పిల్లల కోసం ఎంత పిలిచినా రాలేదు.. అందుకే మన శాస్త్రవేత్తలే చందమామ వద్దకు వెళ్లేందుకు మార్గం కనిపెట్టారు.. జాబిల్లి జాడలు వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. జూలై 22న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరడంతో చం ద్రయాన్–2 యాత్ర ప్రారంభమైంది. 48 రోజులకు ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై శనివారం తెల్లవారుజామున 1.30– 2.30 గంటల మధ్యలో చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ యాత్ర ద్వారా చంద్రగ్రహంపై ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. మొదటి ప్రయత్నంలోనేజాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలిదేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. దటీజ్ ఇండియా!
గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచి.. గగనాంతర రోదసిలో.. గంధర్వగోళ గతులు దాటేందుకు.. రంగం సిద్ధమవుతోంది! భారతీయులుగా మనమంతా గర్వించే రోజు రానే వచ్చింది.. కచ్చితంగా చెప్పాలంటే ఇంక కొన్ని గంటలే.. చంద్రయాన్–2 ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి దక్షిణ ధృవంపై వాలడమే ఆలస్యం.. అంతరిక్ష యవనికపై భారత త్రివర్ణ పతాకం గర్వంగా నిలవనుంది!
48 రోజుల నిరీక్షణకు తెరపడే శుభసమయం ఇంకో 24 గంటల్లోనే రానుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 1.30– 2.30 గంటల (శుక్రవారం అర్ధరాత్రి దాటాక) మధ్యలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ప్రయోగించిన చంద్రయాన్ –2 ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగనుంది. బాలారిష్టాలను దాటుకుని జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్–2 ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత జాబిల్లి కక్ష్యలోకి చేరింది. మూడు లక్షలకుపైగా కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వారం రోజుల కింద జాబిల్లి సమీపానికి చేరిన ఈ అంతరిక్ష నౌక దశల వారీగా మన సహజ ఉపగ్రహానికి దగ్గరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి చివరి ఘట్టమైన సాఫ్ట్ల్యాండింగ్ శనివారం తెల్లవారుజామున జరగనుంది.
ఎందుకింత ప్రాముఖ్యం?
చంద్రయాన్ –2 విజయవంతమైతే ఇస్రో బోలెడు రికార్డులు సృష్టించనుంది. మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి ల్యాండర్ను పంపిన నాలుగో దేశంగానూ రికార్డుల్లోకి ఎక్కుతుంది. కాగా, ఆర్బిటర్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై దిగడం ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం. ఇతర గ్రహాలపై సాఫ్ట్ల్యాండింగ్కు ప్రయత్నించడం ఇస్రోకు ఇదే తొలిసారి. అనేక క్లిష్ట పరిస్థితుల్లో విక్రమ్ దిగాల్సి ఉంటుంది.
భూమితో పోలిస్తే జాబిల్లిపై గురుత్వ శక్తి మూడొంతులే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాబిల్లి గురుత్వశక్తి ప్రభావానికి గురైన వెంటనే వేగంగా జారిపడిపోవడం మొదలవుతుంది. గాలి కూడా ఉండదు కాబట్టి.. పతనాన్ని నిరోధించే అవకాశం ఉండదు. గాలి లేకుండా ప్యారాచూట్స్ పనిచేయవు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ మోటార్ల సాయంతోనే వేగాన్ని నియంత్రించుకుంటూ గంటకు 3.6 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో దిగాల్సి ఉంటుంది.
రోవర్ వేరుపడటంతో ప్రయోగం పూర్తి..
జాబిల్లిపై విక్రమ్ సాఫ్ట్ల్యాండింగైన తర్వాత కొన్ని గంటలకు అందులోనే నిక్షిప్తమై ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది. జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ ఈ చిట్టి రోబో ప్రయోగాలు చేస్తుంది. ఈ రోవర్లో రెండు పరికరాలు ఉంటాయి. ల్యాండైన ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ.. అక్కడి మట్టిని పరిశీలిస్తుంది. ఏయే మూలకాలు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తుంది. దక్షిణ ధృవం వద్ద సూర్యరశ్మి ఉండే 14 రోజుల పాటు ఈ రోవర్ పనిచేసేలా డిజైన్ చేశారు.
దక్షిణ ధృవం ప్రత్యేకత?
అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ఇప్పటికే చందమామపై అనేక ప్రయోగాలు చేపట్టింది. అయితే చంద్రగ్రహ మధ్యరేఖకు కొంచెం అటు ఇటు మాత్రమే ప్రయోగాలు చేశాయి. సూర్యరశ్మి బాగా ఉంటుంది కాబట్టి పరికరాలకు అవసరమైన విద్యుత్తు తయారు చేసుకోవడం సులువు కాబట్టి.. అందరూ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ.. ఇస్రో ల్యాండర్ దిగనున్న దక్షిణ ధృవ ప్రాంతం మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో ఇప్పటివరకు ఎవరూ కాలు పెట్టని, పరిశీలనలు జరపని ప్రాంతాల్లో ఇది ఒకటి. భూమి నుంచి విడిపోయేటప్పటి శిలాజాలు ఈ ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉండే అవకాశముంది. చంద్రయాన్ –1 ద్వారా జాబిల్లిపై నీరు ఉన్న విషయం స్పష్టమైంది. చంద్రయాన్–2 ద్వారా ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది.
ఆ చివరి గంట..
విక్రమ్ సాఫ్ట్ ల్యాండర్లోని కెమెరాలు ప్రతి సెకనుకు తాను దిగాల్సిన ప్రాంతం తాలూకు ఫొటోలు తీస్తూ మనకు పంపుతుంటాయి. వాటి నుంచి అనువైన ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేస్తారు. ఆ ఎంపికకు అనుగుణంగా విక్రమ్లోని కంప్యూటర్లు ఎత్తు, వేగం, దూరం వంటి వాటిని లెక్కించుకుని దిగుతుంది. భూమ్మీది నుంచే విక్రమ్లోని ఐదు రాకెట్ ఇంజన్లను నియంత్రిస్తుండటం ఇంకో క్లిష్టమైన పరిస్థితి. ముందుగా దాని వేగం తగ్గించడం.. ఆ తర్వాత ఉపరితలానికి కొంచెం ఎత్తులో స్థిరంగా ఉండేలా చేయడం.. దిగాల్సిన ప్రాంతానికి చేరేలా దిశ మార్చడం వంటివన్నీ చాలా కీలకం. ఇలా రియల్ టైమ్లో అంతరిక్ష నౌక ల్యాండింగ్ ఏ దేశమూ ఇప్పటివరకూ చేపట్టలేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. విక్రమ్లోని కెమెరాలు, దూరాన్ని కొలిచే లేజర్ పరికరాలు, కంప్యూటర్లు, భూమ్మీది శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.
ఆర్బిటర్
చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. ఇది సొంతంగా దాదాపున వెయ్యి వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ ఏడాది పాటు పనిచేస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది.
విక్రమ్
చంద్రయాన్–2 ద్వారా జాబిల్లిపైకి దిగే ల్యాండర్ పేరు ‘విక్రమ్’. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ స్మారకార్థం ల్యాండర్కు ఈ పేరు పెట్టారు. ఇది దాదాపు 1,471 కిలోల బరువుంటుంది. ఇది 14 రోజుల పాటు పనిచేస్తుంది. రోవర్ సాఫ్ట్ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర దీనిదే.
ప్రజ్ఞాన్
ఆరు చక్రాలుండే రోవర్ పేరు ప్రజ్ఞాన్. 27 కిలోల బరువుంటుంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన దగ్గరి నుంచి సౌర శక్తి సాయంతో 500 మీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఎక్స్రే కిరణాలను ప్రసారం చేస్తూ చంద్రుడి
ఉపరితలంపై ఏయే మూలకాలు ఎక్కువగా ఉన్నాయో చెబుతుంటుంది.
చంద్రయాన్ ప్రస్థానం ఇలా..
జూలై 22 : శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి
జూలై 24 : భూమి చుట్టూ తిరిగే కక్ష్య దూరం పెంపు. అతిదగ్గరగా 230 బై 45,163 కిలోమీటర్లతో కక్ష్య
జూలై 26 : మరోమారు కక్ష్య దూరం పెంపు. ఈ సారి అతిదగ్గరగా 251 బై 54,829 కిలోమీటర్లతో కక్ష్య
జూలై 29 : మూడోసారి కక్ష్య దూరం పెంపు. చోదక వ్యవస్థలను సుమారు 989 సెకన్లు వాడుకుంటూ భూమికి అతిదగ్గరగా 276 బై 71,792 కిలోమీటర్లతో కక్ష్య.
ఆగస్టు 2 : నాలుగో కక్ష్య పెంపు ప్రయోగం విజయవంతం. భూమికి 277 బై 89,472 కిలోమీటర్ల దూరంగా కొత్త కక్ష్య మార్గం.
ఆగస్టు 6 : చివరి కక్ష్య పెంపు పూర్తి. చోదక వ్యవస్థలను ఉపయోగించుకుని భూమికి దగ్గరగా 276 బై 1,42,975 కి.మీ. కక్ష్య.
ఆగస్టు 20 : జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్–2ను మళ్లించిన శాస్త్రవేత్తలు. జాబిల్లికి 114 కి.మీ. దగ్గరగా.. 18,072 కిలోమీటర్లు దూరంగా కక్ష్య మార్గం.
ఆగస్టు 21 : జాబిల్లి చుట్టూ తిరుగుతున్న కక్ష్య దూరం తగ్గింపు. అతిదగ్గరి దూరం 118 బై 4412 కిలోమీటర్లకు తగ్గింపు.
ఆగస్టు 28 : మూడో కక్ష్య కుదింపు ప్రక్రియ విజయవంతం. తాజా కక్ష్య మార్గం అతి దగ్గరగా 179 బై 1412 కి.మీలు.
ఆగస్టు 30 : నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియ. చోదక వ్యవస్థలను 1155 సెకన్ల సేపు వాడుకుని కక్ష్య మార్గాన్ని 124 బై 164 కిలోమీటర్లకు కుదించారు.
సెప్టెంబర్ 2 : ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరుపడిన ల్యాండర్ విక్రమ్. జాబిల్లి చుట్టూ 119 బై 127 కిలోమీటర్ల కక్ష్యలో విక్రమ్ భ్రమణం
సెప్టెంబర్ 3 : ఆర్బిటర్ కక్ష్య సవరణ ప్రక్రియ మొదలు. 4 సెకన్ల పాటు ఇంజిన్లను వాడుకోవడం ద్వారా విక్రమ్ కక్ష్యను 104 బై 128 కిలోమీటర్లుగా మార్పు.
సెప్టెంబర్ 4 : విక్రమ్ను జాబిల్లికి మరింత చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్. తాజాగా విక్రమ్ కక్ష్య 35 బై 101
0 Response to "చంద్రయాన్ 2 అద్భుతం సృష్టించనుంది..!"
Post a Comment