దేహం ఫిట్..దేశం హిట్
- శారీరక దృఢత్వం మన సంస్కృతి
- టెక్నాలజీ వల్లే దాన్ని మరచిపోయాం
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఫిట్నె్సను జీవన మంత్రంగా మార్చుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆరోగ్యం, మంచి జీవనశైలి పట్ల మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఫిట్ ఇండియా’ పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. మరింత దృఢమైన భారత్ కోసం భారతీయులంతా ప్రతిజ్ఞ చేయాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వేల మంది పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శారీరక శ్రమ, క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నది ఫిట్ ఇండియా ఉద్యమ లక్ష్యమని చెప్పారు. హాకీ మాంత్రికుడు, మేజర్ ధ్యాన్చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్న విషయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ ఫలితంగానే ఆయన అన్ని పతకాలు సంపాదించారని చెప్పారు. త్రివర్ణ పతాకానికి రోజురోజుకూ వన్నె తెస్తున్న భారతీయ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని కేవలం క్రీడల వ్యవహారంగా చూడకూడదని, ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన జీవితానికి మార్గంగా చూడాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కదలకుండా కూర్చొనే జీవనశైలి అలవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికి ఐదువేల అడుగులే వేశావు, ఇంకా రెండు వేల అడుగులు బాకీ ఉన్నావు, పద’’ అని స్మార్ట్ఫోన్ యాప్ చెప్పాల్సి వస్తోందన్నారు
జీవనశైలి వ్యాధులు వస్తున్నాయని, చిన్నచిన్న మార్పులతో వాటిని దిద్దుకోవచ్చని చెప్పారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజం.. శ్రేష్ట భారత నిర్మాణానికి మార్గం ఇదేనన్నారు. కుటుంబం రోజువారీ చర్చలో ఫిట్నె్సను భాగం చేయాలని సూచించారు. కొందరు వ్యక్తులు ఉత్సాహంగా ఫిట్నెస్ సామగ్రి కొనేసి హడావుడి చేస్తారని, నాలుగు రోజుల తర్వాత అవి సామాన్ల గదిలోకి వెళ్లిపోతాయని వ్యాఖ్యానించారు. మనం ఏ వృత్తిలో ఉన్నా అందులో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించగలగాలని, భౌతికంగా, మానసికంగా పూర్తి ఫిట్గా ఉన్నపుడే ఇది సాధ్యమని చెప్పారు. కార్పొరేట్ ఆఫీసుల బోర్డు రూమ్ల నుంచి బాలీవుడ్ వరకు విజయానికి ఫిట్నెసే కీలకమన్నారు. వ్యాయామం మొదలుపెట్టాకే మన దేహం మనకు మెరుగ్గా అర్థం అవుతుందన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని గురువారం దేశవ్యాప్తంగా పలు కళాశాలలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాని గతంలో గూగూల్ హ్యాంగవుట్ ద్వారా కూడా ఫిట్నెస్ సందేశమిచ్చారు. ‘‘నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఒకేరకమైన ఉత్సాహంతో ఉంటాను. దానికి కారణం నేను చేసే యోగాయే. నాకు అలసట అనిపించినపుడు కాసేపు బలంగా గాలి పీల్చడం ద్వారా తిరిగి ఉత్సాహాన్ని పొందుతాను’’ అని నాటి సందేశంలో చెప్పారు.
గత ఏడాది విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్నెస్ చాలెంజ్కు మోదీ స్పందించారు. వ్యాయామం చేస్తూ వీడియో పెట్టారు. యోగాతో పాటు ప్రకృతిలోని పంచతత్వాలతో కూడిన ట్రాక్లో నడుస్తానని చెప్పారు. భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం... ఈ అంశాలు తన వాకింగ్ ట్రాక్లో ఉంటాయని వివరించారు.
ఆయుష్ గురువులపై స్టాంపులు
భారతీయ వైద్య విధానాలకు సంబంధించిన 12 మంది ఆధునిక గురువులపై శుక్రవారం మోదీ స్టాంపులు విడుదల చేయనున్నారు. వారిలో ఏడుగురి పేర్లు వెల్లడించారు.
దిన్షా మెహతా: గాంధీ వ్యక్తిగత వైద్యుడు.
హకీమ్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ లఖ్నవీ: లఖ్నవూలో 1902లోనే వైద్య పాఠశాల ఏర్పాటు చేశారు.
స్వామి కువలానంద: యోగ గురువు. 1924లోనే యోగ పాఠశాల ఏర్పాటు చేశారు.
హకీమ్ మహ్మద్ కబీరుద్దీన్: యునానీ వైద్యంపై విస్తృతంగా రచనలు చేశారు.
డాక్టర్ కె.జి.సక్సేనా: హోమియోపతి వైద్యుడు. తొలి రాష్ట్రపతికి వైద్యం చేశారు. ఈయన వల్లే హోమియో వైద్యానికి భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది.
వైద్య యాదవ్జీ త్రికమ్జీ ఆచార్య:
ఆయుర్వేద వైద్యుడు.
వైద్య శాస్త్రి శంకర్ దాజీ పాడే:
ఆయుర్వేద పుస్తకాల రచయిత
0 Response to "దేహం ఫిట్..దేశం హిట్"
Post a Comment