రేపటి నుండి ఓటర్ల జాబితా సవరణ

అక్టోబరు15 వ తేదీన డ్రాప్ట్‌ ఎలక్టోరల్‌ పబ్లికేషన్‌ 
* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌ 


ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:
సెప్టెంబర్‌ ఒకటవ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యమ్రాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్‌ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 30 వ తేది వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు సైతం ఓటరు కార్డులోని తప్పులను సరిదిద్దుకునేందకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు

రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల వద్ద బిఎల్‌ఓలు ఉంటారని తెలిపారు. మార్పులు, చేర్పుల కోసం సంబంధిత వ్యక్తులు వారికి సంబంధించిన పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, రైతు గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన అధికారిక పత్రాలలో ఏదైన ఒకదానితో సంబంధిత ఎన్నికల సిబ్బందిని, అధికారులను సంప్రదించవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయంలోనూ, డివిజన్‌ స్థాయిలోనూ, తహశీల్ధార్‌ కార్యాలయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. . డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను అక్టోబరు 15 వ తేదీన, 2020 జనవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లోనూ... 
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున నేషనల్‌ ఓటర్స్‌ సర్వీస్‌ పోర్టల్‌, ఓటర్స్‌ హెల్ప్‌ మొబైల్‌ యాప్‌, 1950 కాల్‌సెంటర్‌ ద్వారా కూడా ఈ మార్పులను చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సంబంధిత మార్పులు చేస్తారని తెలిపారు. వికలాంగ ఓటర్లు 1950 హెల్ప్‌లైన్‌ ద్వారా వివరాలు తెలియజేస్తే, వారి నమోదుకు సంబంధించి చర్యలు తీసుకుంటారని వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రేపటి నుండి ఓటర్ల జాబితా సవరణ"

Post a Comment