పరీక్ష జరిగిన రోజే కీ: జీకే ద్వివేది
వదంతులు నమ్మొద్దని అభ్యర్థులకు సూచన
అమరావతి: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి వదంతులనూ నమ్మవద్దని సూచించారు. వదంతులను వ్యాప్తిచేసే వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహించే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో 1,26,728 పోస్టుల భర్తీకి రాత పరీక్షకు సుమారు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయని ద్వివేది తెలిపారు
పరీక్షల నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ, విద్యాశాఖ, యూనివర్సిటీల సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రశ్నపత్రాలను తరలించేందుకు 1,174 రూట్లను గుర్తించామన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 1,22,554 మంది సిబ్బంది నియమించామని ద్వివేది తెలిపారు. జిల్లాస్థాయిల్లో మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సిబ్బందికి శిక్షణ అందించామన్నారు. అభ్యర్థులను, పర్యవేక్షకులను ర్యాండమ్ పద్ధతిలో వేర్వేరు పరీక్షా కేంద్రాలకు కేటాయించామన్నారు. ఓఎంఆర్ జవాబు పత్రం నకలు తీసుకోవడానికి అనుమతి ఇస్తామని, పరీక్ష జరిగిన పారదర్శకతను పాటించడం కోసం పరీక్ష జరిగిన రోజునే కీ ప్రచురిస్తామన్నారు. సీసీటీవీ, వీడియో కెమెరాలను అవసరమైన చోట్ల వినియోగించడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతి ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు
0 Response to "పరీక్ష జరిగిన రోజే కీ: జీకే ద్వివేది"
Post a Comment