లేకపోతే క్రిమినల్ చర్యలు * ఆర్ఆర్ యాక్టు అమలుకు ఆదేశం * ఉద్యోగులు కార్డులు రద్దు చేసుకోవాలి : డిఎస్ఒ ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్:
తెల్ల రేషన్ కార్డులు కలిగివున్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నది. నిరుపేదలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వ ఉద్యోగులు పొందడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. తెల్ల రేషన్ కార్డులు వున్న ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ కార్డులను సరెండర్ చేయాలని, లేకపోతే క్రిమినల్ చర్యలు, అవసరమైతే రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగించాలన్న యోచనలో ప్రభుత్వం వున్నట్టు అధికార వర్గాల సమాచారం
తెల్ల రేషన్ కార్డుల కోసం పలువురు గతంలో జన్మభూమి/ ప్రజావాణి కార్యక్రమాల్లో, ప్రస్తుతం స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు అందజేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సుమారు పది నెలలు కావస్తుండడంతో, తరువాత అందజేసిన వేలాది దరఖాస్తులు పెండింగ్లో వున్నాయన్న విషయం ప్రభుత్వం దష్టికి వచ్చింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులు అధికంగా వున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో చాలావరకు బోగస్ కార్డులు, అనర్హులు వున్నట్టు భావిస్తున్నది. దరఖాస్తుదారుల్లో అర్హులకు తెల్ల రేషన్ కార్డులతోపాటు ప్రభుత్వ పథకాలు అందించాలంటే ముందు బినామీలు, అనర్హుల వద్ద వున్న కార్డులను ఏరివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలుత ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వున్న తెల్ల రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ట్రెజరీ ద్వారా జీతాలు పొందే ఉద్యోగుల వివరాలు సేకరించారు. ఆ విధంగా జిల్లాలో ప్రస్తుతం దాదాపుగా 18వేల తెల్లరేషన్ కార్డులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. పౌరసరఫరాల అధికారులకు తరువాత ఆదేశాలు రావడంతో నిలుపుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన తెల్ల కార్డులపై ఆంక్షలు సడలించారు. ఈ నెలకు సంబంధించి సరుకులు తీసుకువెళ్లవచ్చని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ప్రభుత్వ ఉద్యోగి పేరుతో వుంటే మాత్రం వెంటనే కార్డును సరండర్ చేయాలని, ఒకవేళ తండ్రి పేరిట వున్నా తెల్ల కార్డులో, ప్రభుత్వ ఉద్యోగి అయిన కుమారుడు వుంటే, వెంటనే పేరు తొలగించుకోవాలని...తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు యథావిధిగా రేషన్ పొందవచ్చునంటూ ఆయా కార్డు యజమానులకు చెప్పాలని పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ డీలర్లను ఆదేశించారు. అయినప్పటికీ తెల్ల రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించుకోకపోతే డిపోల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. అటువంటి వ్యక్తులు సరుకులు తీసుకుంటే చర్యలకు ఉపక్రమించాలని యోచిస్తోంది. ఈ నెలాఖరులోగా రేషన్ కార్డులను సరెండర్ చేయడం లేదా పేర్లు తొలగించుకోకపోతే క్రిమినల్ చర్యలు, అవసరమైతే ఆర్ఆర్ యాక్టు అమలు చేసేందుకు దృష్టిసారించింది.
ప్రభుత్వ ఉద్యోగుల పేరిట కార్డులు రద్దుచేసుకోవాలి
ప్రభుత్వ ఉద్యోగుల పేరిట వున్నటువంటి తెల్లరేషన్ కార్డులను రద్దుచేసుకోవాలి.కార్డులను తొలగించుకోకపోతే ప్రభుత్వాదేశాలనుసరించి చర్యలు చేపడుతాం. అలాగు ఉద్యోగి కాని వారి పేరిట ఉన్న కార్డు తొలగించినట్లయితే తమ దృష్టికి తెస్తే అలాంటివాటిని రద్దు కాకుండా చూస్తాం.
- పద్మశ్రీ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
0 Response to "తెల్ల కార్డుంటే సరెండర్ చేయాల్సిందే.."
Post a Comment