రూ.1000లకు పైబడి వ్యయమైన రోగానికి ఆరోగ్యశ్రీ.. ఎప్పటినుంచి అంటే.
- - ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్గా పశ్చిమ..
- - రూ.1000 నుంచి రూ.5 లక్షల వరకు వైద్యం
- - జనవరి నుంచి జిల్లాలో అమలు
- - నేడు వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ కమిషనర్తో జిల్లా అధికారుల సమీక్ష
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన ఆరోగ్యశ్రీ పథకానికి పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. కొత్త విధానంలో రూ.1000లకు పైబడి వ్యయమైన రోగానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని భావిస్తున్నారు. గరిష్టంగా రూ.5 లక్షలు పరిమితి విధించారు. జిల్లాలో జనవరి ఒకటో తేదీ నుంచి పైలట్ ప్రాజెక్ట్ అమలు కానుంది. ఆ తర్వాత అన్ని జిల్లాలకు వర్తింపజేయనున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించనున్నారు. సీ కేటగిరీ ఆసుపత్రులను ఈ పథకం నుంచి మినహాయిస్తారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శస్త్ర చికిత్సలు, ప్రాణాంతక వ్యాధులు వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. తెల్లకార్డు లబ్ధి దారులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది. కంటి వైద్యానికి, గర్భిణులకు పథకాన్ని అమలు చేశారు. ప్రస్తుతం రూ.1000ల పైబడే వైద్యానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని సంకల్పించారు. పశ్చిమనే పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 42 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. అందులో 18 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. మరో 24 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అమలు జరుగుతోంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి తేవడంతోపాటు, వైద్య భారం లేకుండా చేసేలా నూతన విధానాన్ని ఖరారు చేస్తున్నారు.
ఇతర రాష్ర్టాల్లో సేవలకు వర్తింపు
ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ర్టాల్లో పొందిన వైద్య సేవలకు వర్తింపజేయనున్నారు. అందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేశారు. మూడు నగరాల్లోనూ 150 ఆసుపత్రులను ఎంపిక చేయాలని వైద్య ఆరోగ్య శాఖ దిశానిర్దేశం చేసింది. ఆ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన జిల్లా ప్రజలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది.
గత ప్రభుత్వ హయాంలోనే పెంపు..
ఆరోగ్యశ్రీ పథకంలో రూ.5 లక్షల పరిమితిని గత ప్రభుత్వ హయాంలోనే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకు నోచుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మారిపోవడంతో అవి అమలుకు నోచుకోలేదు. తాజాగా జిల్లా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. జనవరి నుంచి కొత్త విధానం అమలు జరగనుంది.
నేడు ప్రాజెక్టు అమలుపై సమీక్ష..
జిల్లా పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేయడంతో జిల్లా అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సమీక్ష నిర్వహించనుంది. చీఫ్ కమిషనర్తో సహా జిల్లా డీసీహెచ్ఎస్, డీఎంహెచ్వోలు సమీక్షలో పాల్గొంటారు. పైలట్ ప్రాజెక్ట్ విధి విధానాలపై చర్చిస్తారు. అనంతరం మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు
0 Response to "రూ.1000లకు పైబడి వ్యయమైన రోగానికి ఆరోగ్యశ్రీ.. ఎప్పటినుంచి అంటే."
Post a Comment