అమెరికా తరహాలో : దేశంలో అధ్యక్ష పాలన రాబోతుందా?

భారత్ కూడా అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం దిశగా వెళ్తోందా? ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాటలు పరుస్తున్నారా? రాజ్యాంగాన్ని సవరించబోతున్నారంటూ కొన్ని రోజులుగా ఈ వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొన్ని ప్రముఖ పత్రికలు కూడా ఈ రకమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. అలా జరిగితే భారత దేశానికి చివరి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందేనంటూ కథనాలు ప్రచురించాయి. 2020లో లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి మోడీ సర్వాధికారాలు కలిగిన దేశ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానమంత్రిగా ఉంటారని, ప్రస్తుతం దేశ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది అంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి.

అయితే మోడీ ఆలోచిస్తున్నది అమెరికా తరహా అధ్యక్ష తరహా పాలనా లేక మరో రకమైన అధ్యక్ష తరహా పాలన అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది


ఎన్ని విమర్శలు చేసినా లెక్కచేయకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ స్టయిల్ వేరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడీ తాను తీసుకునే నిర్ణయాలను ప్రజల చేత ఆమోదించుకోవడంలో దిట్ట. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నాయకులను, మేధావులను సైతం తనవైపు తిప్పుకోవడంలో మోడీని మించినవారు మరొకరు లేరు.

అలాంటి మోడీ ఇప్పుడు ఈ అధ్యక్ష తరహా పాలన వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోని చాలా మంది నాయకులు కూడా ఎప్పటి నుంచో ఇదే భావన కలిగి ఉన్నారని చెబుతున్నారు.గతంలో వాజ్ పేయి హయాంలో తొలి ఎన్డీయే ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు ఓ కమిటీని వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్డీయేలోని కొందరు నాయకులు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. అధ్యక్ష తరహా పాలనకు అనుకూలంగా మాట్లాడారని చెబుతున్నారు. వన్ మార్కెట్, వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ ల్యాంగ్వేజ్ అంటూ ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు వన్ పార్టీ.. వన్ లీడర్ దిశగా వెళ్లినా ఆశ్యర్చపోనక్కర్లేదని పలువురు తమ అభిప్రయాలను వ్యక్తం చేస్తున్నారు.



పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే దక్షిణ రాష్రాలు కానీ, సౌత్ ఈస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ప్రధానమంత్రి పదవులు చేపట్టడం కష్టం. అలాంటిది అధ్యక్ష తరహా పాలన వస్తే ఓ మళయాలీ కానీ, ఓ తమిళుడు కానీ, ఓ తెలుగువాడు కానీ, ఓ అస్సామీ కానీ ఎప్పటికీ దేశ పగ్గాలు చేపట్టలేడని, ఎందుకంటే దేశ జనాభాలో హిందీ మాట్లాడే మెజార్టీ ప్రజలు వీరిని అంగీకరించరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రాజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన భారత్ కు అధ్యక్ష తరహా పాలన సాధ్యమయ్యేదా అనే డౌట్ కూడా వస్తోంది. చూడాలి.. కొత్త చరిత్ర ఏ విధంగా లిఖించబడుతుందో.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమెరికా తరహాలో : దేశంలో అధ్యక్ష పాలన రాబోతుందా?"

Post a Comment