మీరు సరేనంటేనే మీ ఖాతాలోకి సొమ్ము!
ఈనాడు, దిల్లీ: ఎవరి బ్యాంకు ఖాతాలోకైనా ఆన్లైన్లో నగదు బదిలీ చేయాలన్నా, నేరుగా సొమ్ము జమ చేయాలన్నా ఇకపై సంబంధిత ఖాతాదారు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఖాతాదారుకు తెలియకుండా ఆన్లైన్లో సొమ్ము బదిలీ చేయడానికి, నేరుగా నగదు జమ చేయడానికీ అవకాశం ఉంది.
ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా సంఖ్య, బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్ తెలిస్తే చాలు..సులభంగానే నగదు బదిలీ చేసుకునే వీలుంది. నోట్ల రద్దు సమయంలో చాలా మంది ఖాతాదార్లకు తెలియకుండానే వారి జన్ధన్ ఖాతాల్లో కొందరు తమ అక్రమ సంపాదనను బదిలీ చేయడంతో అలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈ నిబంధన తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని రిజర్వు బ్యాంకును కోరింది. రిజర్వు బ్యాంకు అనుమతిస్తే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఎవరైనా మరొకరి ఖాతాలో సొమ్ము జమ చేయాలని అనుకున్నప్పుడు బ్యాంకు తొలుత ఆ ఖాతాదారుకు సందేశం పంపిస్తుంది. ఇందుకు ఖాతాదారు అంగీకరిస్తే వారి నుంచి కొంత ఛార్జీ తీసుకొని నగదు బదిలీ చేస్తుంది. ఈ ఛార్జీలు చెల్లించడానికి ఇష్టపడనివారికి సొమ్ము బదిలీ చేయడానికి అవకాశం లేదు.
0 Response to "మీరు సరేనంటేనే మీ ఖాతాలోకి సొమ్ము!"
Post a Comment